దుబ్బాకలో కొత్తగా 1,804 మందికి పింఛన్లు మంజూరు చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కారుదేనని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో 1,804 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛన్లు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దుబ్బాక పట్టణంలో 816, దుబ్బాక మండలంలో 988 మందికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేసినట్టు చెప్పారు. టీడీపీ హయాంలో రూ. 50, కాంగ్రెస్ హయాంలో రూ. 200 పింఛన్ మాత్రమే ఉండేదని, అది ఏ మూలకూ సరిపోయేది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ ప్రతి ఇంటి పెద్ద కొడుకులా రూ. 2016 పింఛన్ ఇస్తూ ఆసరాగా నిలుస్తున్నారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మందికి, దుబ్బాక నియోజకవర్గంలో 50 వేల మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నామని వివరించారు. అర్హులైన వారందరికీ పింఛన్ తప్పకుండా ఇస్తామని స్పష్టం చేశారు. ఈ నెల నుంచి చేనేత కార్మికుడు మృతి చెందితే రూ.5లక్షల బీమా వర్తించేలా రాష్ట్ర సర్కారు ఆమోదం తెలిపిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని సాగు, తాగు నీటి గోస తీరిందని, రెండు నెలల నుంచి కూడెల్లి వాగు మత్తడి దూకుతున్నదని తెలిపారు. 15 రోజుల్లో దుబ్బాక 100 పడకల దవాఖానలో డయాలసిస్ వైద్య సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. దుబ్బాక దవాఖానలో న్యూ బార్న్ స్టెబిలైజేషన్ సెంటర్ను ప్రారంభిస్తామని తెలిపారు. భూంపల్లిలో రూ.1.56 కోట్లతో నూతన పీహెచ్ సీ మంజూరు చేసినట్టు వివరించారు.త్వరలో దుబ్బాక జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడారు. 57 ఏండ్లకే ఆసరా పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని దుబ్బాక లో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు, జడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.