హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)ను రద్దు చేయాలని కేంద్రాన్ని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. దీనివల్ల పేద వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్, పలు విద్యార్థి సంఘాలు శుక్రవారం ఢిల్లీ జంతర్మంతర్ వద్ద నిర్వహించిన ‘చలో పార్లమెంట్’ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. పదేండ్లుగా బీజేపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. విద్యా కాషాయీకరణకు, విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.