హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు ఉద్యోగుల పీఆర్సీపై ప్రభుత్వం మరోసారి చర్చలు జరుపనున్నది. విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అందుబాటులో లేకపోవడంతో చర్చలను వారంపాటు వాయిదావేశారు. పీఆర్సీపై చర్చించేందుకు టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు రెండు జేఏసీల నేతలతో శక్రవారం విద్యుత్తు సౌధలో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఒక్కో జేఏసీ నుంచి 12 మంది చొప్పున సభ్యులు రాగా, మంత్రి జగదీశ్రెడ్డి అందుబాటులో లేకపోవడంతో రాలేకపోయారు. ఈ మేరకు మరో వారంరోజుల్లో భేటీ అవుదామన్న మంత్రి సూచన మేరకు, ఆయన సమక్షంలో మరో దఫా చర్చలు జరుపాలని నిర్ణయించారు. సమావేశంలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు కోడూరి ప్రకాశ్, శివాజీ, పీ అంజయ్య, షరీఫ్, వేణుబాబు, జాన్సన్, మాతంగి శ్రీనివాస్, రామేశ్వరయ్య శెట్టి, పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు సాయిబాబు, రత్నాకర్రావు, శ్రీధర్, అనిల్, బీసీరెడ్డి, వజీర్ తదితరులు పాల్గొన్నారు.