Jangaon | జనగామ రూరల్, ఏప్రిల్ 13 : మూడు రోజులుగా ధాన్యం ధర విషయంలో జనగామ వ్యవసాయ మార్కెట్లో రైతులు, వ్యాపారులకు మధ్య జరుగుతున్న చర్చలు విఫలమయ్యాయి. ఉమ్మడి జిల్లా మార్కెటింగ్ శాఖ డీడీ రాజూనాయక్ శనివారం జనగామ మార్కెట్కు చేరుకొని అధికారులతోపాటు ట్రేడర్లు, అడ్తిదారులతో చర్చలు జరిపారు. తమపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, ఇప్పటివరకు మార్కెట్లో ఇ-నామ్ ప్రకారమే కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు సదరు అధికారి దృష్టికి తెచ్చారు. ఎండాకాలం కావడంతో అకాల వర్షాలు కురుస్తాయని, పంట చేతికి రాకముందే వరికోతలు కోస్తుండటంతో ధాన్యం పచ్చిగా ఉంటుందని, తాలు, గడ్డి వస్తుండటంతో ఈ-నామ్ ప్రకారం టెండర్ ద్వారా ధర ప్రకటించి వారు నిర్ణయించిన ధరకే కొనుగోలు చేస్తున్నామని, ఇక్కడ ట్రేడర్లు, వ్యాపారుల సొంత నిర్ణయం లేదని వ్యాపారులు పేర్కొన్నారు.
తక్కువ ధర వస్తుందని రైతులు చెబితే అధికారులు తమపై కేసులు పెట్టడమేంటని సదరు అధికారిని నిలదీశారు. నాణ్యత ఉంటే సరుకు కొనుగోలు చేస్తామని తెలిపారు. నిబంధనల ప్రకారం ఎంఎస్పీకి మార్కెట్లో కొనుగోళ్లు సాధ్యం కాదని స్పష్టం చేశారు. గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అందులోనే రైతులు తమ సరుకును అమ్ముకోవచ్చని సూచించారు. ట్రేడర్ల సంఘం అధ్యక్షుడు నాగబండి రవీందర్ మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి మార్కెట్లో ఎలాంటి సరుకులు కోనుగోలు చేయబోమని మార్కెటింగ్ డీడీ రాజు నాయక్కు తెలియజేశామని అన్నారు.