Telangana | పెద్దపల్లి, జనవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై అడుగడుగునా వివక్ష చూపుతున్న కేంద్రం.. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపునివ్వడంలోనూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఇతర రాష్ర్టాల్లో రైల్వే స్టేషన్లకు ప్రముఖుల పేర్లు, సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా నామకరణం చేస్తున్న కేంద్రం.. తెలంగాణ నుంచి నడిచే రైళ్లకు పేర్లు పెట్టడంలో వివక్ష చూపుతున్నది. ఒక్కటంటే ఒక్క రైలుకు కూడా తెలంగాణ వైభవం చాటేలా పేరు పెట్టకపోవడం తెలంగాణపై బీజేపీ సర్కారుకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా తెలంగాణకు చెందిన కిషన్రెడ్డే ఉన్నా రాష్ర్టానికి ఈ దుస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రా ష్ట్రం నుంచి బీజేపీకి నలుగురు ఎంపీలు ఒక్కసారి కూడా ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించకపోవటంపై మండిపడుతున్నారు. పకనే ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేరళలోని రైళ్లకు వాళ్ల రాష్ట్రంలోని నదుల పేర్లు, వారి రా ష్ర్టాల కవుల పేర్లు, ప్రముఖుల పేర్లు, ప్రముఖ దేవాలయాల పేర్లు, రాజులు, రాజ్యాల పేర్లు పెట్టి నడిపిస్తున్నారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్లోనూ ప్రముఖుల పేర్లను రైల్వే స్టేషన్లకు నామకరణం చేశారు.
మధ్యప్రదేశ్ భోపాల్ దగ్గర్లోని హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్ పేరును రాణి కమలాపతిగా, మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ రైల్వేస్టేషన్ పేరును నర్మదాపురంగా, ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జంక్షన్ పేరును వీరాంగణ లక్ష్మీబాయి జంక్షన్గా, మొఘల్సారాయి జంక్షన్ని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్గా, అలహాబాద్ జంక్షన్ని ప్రయాగరాజ్ జంక్షన్గా, ఫైజాబాద్ జంక్షన్ని అయోధ్య కంటోన్మెంట్గా పేర్లు పెట్టారు. తమిళనాడు రాజధాని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పేరును భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ ఎంజీ రామచంద్రన్ రైల్వేస్టేషన్గా మార్చారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వీరనారి కర్ణాటకకు చెందిన రాణిచెన్నమ్మ పేరుతో బెంగళూరు నుంచి రైలు నడిపిస్తున్నారు. దాదాపు ఈ రైళ్ల పేర్లన్నీ కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చాకే పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సికింద్రాబాద్/ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం/ కాకినాడ/ కర్నూల్ వైపు వెళ్లే రైళ్లకు గోదావరి, గౌతమి, తుంగభద్ర, హంద్రీ నదుల పేర్లతో రైళ్లను ప్రారంభించారు. తెలంగాణ ప్రాంత నదుల పేర్లు పెట్టడంలో మాత్రం వివక్ష చూపారు.
ఈ రైల్వేస్టేషన్లకు తెలంగాణ పేర్లు పెట్టాలి
తెలంగాణలోని ప్రముఖ రైల్వేస్టేషన్లు, రైళ్ల కు తెలంగాణ వైభవం ఉట్టిపడేలా బతుకమ్మ, సమ్మక్క, సారక్క, గోండువీరుడు కుమ్రంభీం, సర్ధార్ సర్వాయి పాపన్న, కాళోజీ, దాశరథి, పీవీ తదితర ప్రముఖులు, ప్రాంతాల పేర్లు పెట్టాలనే డిమాండ్ వినిపిస్తున్నది. సికింద్రాబా ద్, హైదరాబాద్, కాచిగూడ, కాజీపేట నుంచి ప్రారంభయ్యే రైళ్లకు ఈ ప్రతిపాదిత పేర్లు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. సిర్పూర్ కాగజ్నగర్-సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు ‘కుమ్రంభీం’ఎక్స్ప్రెస్గా, కరీంనగర్ నుంచి సిర్పూర్ మెము ఎక్స్ప్రెస్ రైలుకు ‘మానేరు’ పుష్పుల్ గా, కాజీపేట నుంచి బల్లార్షా 17036/35 ఎక్స్ప్రెస్ రైలుని రాణిరుద్రమ ఎక్స్ప్రెస్గా, సికింద్రాబాద్-మణుగూరు-సికింద్రాబాద్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు ‘భద్రాద్రి’ ఎక్స్ప్రెస్గా, కరీంనగర్-తిరుపతి-కరీంనగర్ బై వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు ‘రాజరాజేశ్వర‘ ఎక్స్ప్రెస్గా పేరు పెట్టాలని డిమాండ్ చే స్తున్నారు. కాళోజీ పేరుతో ఒక రైలుని ప్రారంభించాలని, దాశరథి, కాళోజీల పేర్లతో ఎక్స్ప్రెస్ రైళ్లు నడపాలని, కొండా లక్ష్మణ్బాపూజీ, జయశంకర్ సార్, సర్వాయి పాపన్న పేర్లతో రైళ్లను ప్రారంభించాలని, ఏదైనా ఒక రైల్వేజంక్షన్కు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రాజెక్టులకు దేవతల పేర్లు పెట్టిన కేసీఆర్
రాష్ట్రంలోని బీడు భూములను సాగు భూములుగా తీర్చిదిద్దేందుకు మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన బరాజ్లు, పంపుహౌస్లకు దేవతల పేర్లను పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరును ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం పేరునే పెట్టగా, బరాజ్లు, పంపుహౌస్లకు లక్ష్మి, సరస్వతి, పార్వతి, నంది, గాయత్రి, భక్తరామదాసు ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలోని రైళ్లకు, రైల్వేస్టేషన్లకు తెలంగాణ ప్రముఖులు, దర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలు, కవులు, కళాకారులు, రచయితలు, నేతల పేర్లు పెట్టడంలో వివక్ష చూపుతున్నది.