హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) : వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్(యూజీ) పరీక్ష విద్యార్థుల టెన్షన్ను దూరం చేసింది. ప్రశ్నలు సులభంగా రావడంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు. నీట్ యూజీ పరీక్ష ఆదివారం నిర్వహించగా, ఈసారి ప్రశ్నలు సులభంగా రావడంతో 720కి 720 మార్కులొచ్చే అవకాశాలున్నాయని శ్రీచైతన్య విద్యాసంస్థల నీట్ శిక్షకుడు శంకర్రావు విశ్లేషించారు. బయాలజీ సబ్జెక్ట్ చాలా సులభంగా ఉన్నట్టు చెప్పారు. అన్ని ప్రశ్నలను ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచే ఇచ్చారని తెలిపారు. కాన్సెప్ట్స్ బాగా చదివిన విద్యార్థులు సులభంగా రాయగలరని అభిప్రాయపడ్డారు.
కాస్త కఠినంగా ఫిజిక్స్..
ఈ సారి ఫిజిక్స్ ప్రశ్నపత్రం కాస్త కఠినంగా ఉన్నట్టు విద్యార్థులు చెప్పారు. నిరుటి పోల్చితే ఈసారి కాస్త సులభంగానే ఉందని కొంతమంది తెలిపారు. 45 ప్రశ్నల్లో 30-35 ప్రశ్నలు సాధారణ విద్యార్థులు ఆన్సర్లు చేసేవిగా, మిగతావి చేసేందుకు కాస్త సమయం పట్టినట్టు చెప్పారు. కెమిస్ట్రీ విభాగం ప్రశ్నలు సులభంగా రాగా, మూడు, నాలుగు ప్రశ్నలు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టినట్టు వెల్లడించారు. 2025తో పోల్చితే ఈ సారి కొంత ఈజీగా ఉన్నందున విద్యార్థులు ఉపశమనం పొందారు. పరీక్ష కోసం రాష్ట్రంలో 199 సెంటర్లు ఏర్పాటు చేయగా 71,500(97శాతం) మంది విద్యార్థులు పరీక్ష రాసినట్టు అధికారులు ప్రకటించారు.
470 మార్కులకు సీటు..
ప్రశ్నపత్రం సులభంగా ఉండటంతో కటాఫ్ మార్కులు 70 వరకు పెరుగనున్నాయి. నిరుడు తెలంగాణలో కన్వీనర్ కోటా సీటు 405 మార్కులకు వచ్చింది. ఈ ఏడాది 470- 480 మార్కులకు వచ్చే అవకాశాలున్నాయి. నీట్ క్వాలిఫైయింగ్ మార్కులు 150-155 మార్కుల మధ్య ఉండే చాన్స్ ఉన్నది. ఈనెల చివరి వారంలో ప్రాథమిక కీ విడుదల, జూన్ రెండో వారంలో ఫలితాలు విడుదలకానున్నాయి.
ఐదేండ్లుగా అత్యధిక మార్కులు..
సంవత్సరం మార్కులు
కటాఫ్ అంచనా..
