హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): నీరా, నీరా అనుబంధ ఉత్పత్తులైన బెల్లం, చక్కెర, నీరా సిరప్ల తయారీతోపాటు ఇతర బై ప్రొడక్ట్ల తయారీ, ప్యాకింగ్, విక్రయానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ధ్రువీకరణ లభించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లభించడంపై ఆబ్కారీశాఖ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం తన కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ గుర్తింపు నీరా పాలసీ అమలులో ఒక శుభపరిణామం అని పేర్కొన్నారు. అద్భుత ఔషధ గుణాలున్న నీరాను క్యాన్సర్, కిడ్నీలు, నరాల బలహీనత వంటి ఎన్నో రోగాలను నయం చేసే ఔషధంగా వాడేవారని తెలిపారు. నెక్లెస్ రోడ్డులో రూ.10 కోట్లతో నిర్మిస్తున్న నీరా కేఫ్ను ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నీరా కలెక్షన్స్ సెంటర్లలో ఉత్పత్తిని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టూరిజంశాఖ ఎండీ మనోహర్, అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు దత్తరాజ్గౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.