హైదరాబాద్ : వ్యవసాయ రంగానికి రుణ పరపతి పెంచాలని, రైతుల ఆదాయం పెంచడానికి నాబార్డు సహకారం కూడా కావాలని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
గురువారం మంత్రి నిరంజన్రెడ్డి నివాసంలో రాబోయే 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి గాను లక్షా 66 వేల 384 కోట్ల రుణ సామర్థ్యంతో నాబార్డు రూపొందించిన రాష్ట్ర దృష్టి పత్రాన్ని మంత్రులు విడుదల చేసి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
జనాభాలో 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని సీఎం కేసీఆర్ గుర్తించారు. అందుకే నాబార్డ్ సహకారంతో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటల పునరుద్ధరణతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని వారు తెలిపారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి తాగునీరు పథకాన్ని పూర్తి చేశామన్నారు.
ఈ పథకాల మూలంగా తెలంగాణ వ్యాప్తంగా భూగర్భజలాలు పెరిగాయి. పంటల విస్తీర్ణం పెరగడంతో పాటు రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి జరుగుతున్నదని వారు పేర్కొన్నారు. ధీర్ఘకాలిక ఆయిల్ పామ్ వంటి పంట సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందన్నారు.
దీనికిగాను నాబార్డు సూచనల మేరకు క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు ఆయిల్ పామ్ సాగుకు సహకరించాలని మంత్రులు కోరారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, ఆహారశుద్ధి రంగంలో ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తున్నది. ప్రతి జిల్లాలో 500 ఎకరాలను గుర్తించి అందులో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.
ఇందులో ఆహార శుద్ధి పరిశ్రమలు, గోడౌన్లు, మౌలిక సదుపాయాలతో పాటు పంటల ఉత్పత్తుల ఎగుమతులకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. అలాగే వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుని యువత ఉపాధి కోసం ఇటు వైపు దృష్టిసారించాలని వారు పేర్కొన్నారు.
దీనికి బ్యాంకర్లు ఆర్థిక సహకారం అందించాలని సూచించారు. నాబార్డు కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని మంత్రులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, అర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ నిఖిల, నాబార్డ్ సీజీఎం వైకే రావు, ఎస్ ఎల్ బీసీ చైర్మన్ అమిత్ జింగ్రాన్, తదితరులు పాల్గొన్నారు.