Dharani | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 31 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో విసిరేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అంటున్నడు. మొన్నటికి మొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కూడా ధరణిపై విషం కక్కాడు. బీజేపీకూడా ధరణి వద్దని అంటున్నది. మరి పాత విధానమే బాగున్నదా? అధికారుల సంతకంతో పట్టాలు మారిపోయే రికార్డులు కావాలా? మన భూమి రిజిస్ట్రేషన్ కోస ం ఆఫీసుల చుట్టూ.. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే రోజులు మళ్లీ రావాలా? ధరణి తో ఎప్పుడంటే అప్పుడు..ఏ రాత్రి అంటే ఆ రాత్రి ఎవరికి వారే చూసుకొనే ధరణి రికార్డు కావాలా? ఊళ్లో ఇలాంటి సందేహాలు వచ్చినపుడు నలుగురు పెద్ద మనుషులల్ల పెట్టి చర్చిస్తం. ‘నమస్తే తెలంగాణ’ కూడా అదే ప్రయత్నం చేసింది. ఇదే ముచ్చటను నలుగురు రైతుల ముందు పెట్టింది. ఖుల్లం ఖుల్లా… దూద్ కా దూద్.. పానీకా పానీ… వాళ్లు చెప్పిందే ఫైనల్. ఎందుకంటే.. ప్రభుత్వం తెచ్చిన ఒక విధానం మంచిగున్నదో లేదో అని చెప్పేందుకు దశాబ్దాలుగా గోస పడిన ‘వీరికంటే’ అనుభవజ్ఞులు ఎవరుంటరు? ఎన్నికల తీర్పును ఇచ్చే ‘వీరికంటే’ న్యాయ నిర్ణేతలు ఎక్కడ దొరుకుతరు? వాళ్ల మనోగతమేందో మీరే చదవండి..
ధరణికి ముందు.. ఓ ఐదెకరాల భూమి వారసత్వంగా పిల్లల పేర్ల మీద (విరాసత్) ఎక్కాలంటే కచ్చీర్కు తిరిగేందుకు రెండు జతల చెప్పులు అరగాల్సిందే. అదీ… పట్వారీ, ఎమ్మార్వో దయ! టైం బాగుంటే ఉన్న భూమి పేర్ల మీదకొస్తది. టైం బాగాలేకపోతే పిల్లల పేర్ల మీదకొచ్చే సరికి గుంటలే కాదు.. ఎకరాలే మాయమైపోతయ్! ధరణి రాకముందు వరకు రాష్ట్రంలోని ప్రతిపల్లెలో భూ రికార్డుల నిర్వహణ తీరిది.
ధరణి తర్వాత.. రికార్డులకు ఎక్కిన భూమిలో గుంట భూమిని కూడా కట్ చేయడం ఎవరితరం కాదు. ఇగ భూమి అమ్మినా.. కొన్నా… పిల్లల పేర్ల మీదకి మార్చాలన్నా… అంతా ఆన్లైన్. పావు గంట, అర్ధగంట పని. పట్వారీతో పని లేదు… దళారీతో అవసరమే ఉండదు.. చిల్లిగవ్వ సమర్పించుకోకున్నా చేతికి కొత్త పాసు పుస్తకాలు వస్తయ్. ధరణి వచ్చిన తర్వాత రైతులకు వచ్చిన సౌలత్ ఇది.
మా నాయన తోడ ఐదుగురు. ఉన్న భూమిని పంచుకుంటే మా పాలుకు ఆరెకరా లు వచ్చింది. రా యపోలు సుబ్రమణ్యం అని ఒక సర్వేయర్ను తీసుకొచ్చి కొలిపించడానికే ఆర్నెల్లు బాధపడ్డం. ఏడాది.. రెండేండ్లు.. పట్వారీ ఆడ రాసుకరాపో.. ఈడ రాసుకరా పో… అని తిప్పిండు. తిరిగి తిరిగి విసిగి వేసారిపోయినం. మా ఆరెకరాల కోసమైతే మూడేండ్లు పట్టింది. ధరణి అచ్చినంక ఆ తిప్పలన్నీ తప్పినయ్. ఏడాది కిందట నా పేరు మీదకెళ్లి ఇద్దరు కొడుకులకు ఒక్కొక్క ఎకరం చేసిన. ఎమ్మార్వో ఆఫీసుకుపోయిన అద్దగంటల పనైంది. ధరణి తీసేస్తే మళ్లీ కథ మొదటికొస్తది.
– మోహన్రెడ్డి, రైతు, ఉప్పరిగూడ, ఇబ్రహీంపట్నం
మా నాయనకు నాలుగెకరాల భూమి ఉంది. నా పేరుకు చేయించుకునేతందుకు మస్తు తిప్పలుపడ్డం. పట్వారీ సుట్టూ తిప్పిచ్చుకున్నడు. కాస్తుల రాయమంటే డబ్బులు తీసుకొని కూడా ఏడాది తిప్పలు పెట్టిండు. చాలా గొళ్లాలు పెట్టేది. ధరణి వచ్చినంక చాలా మారింది. ఆఫీసులపొంటి తిరుగుడు తప్పింది? రిజిస్ట్రేషన్ అయినంక వెంటనే పాసు బుక్కులు ఇస్తున్నరు. ధరణి తీసేస్తే మళ్లీ పాత లెక్కనే అయితది. కాంగ్రెసోళ్ల ప్రభుత్వం ఉన్నపుడు ఎప్పుడూ కర్ఫ్యూ అయితుండేది. ఎప్పుడూ కొట్లాటలే. ఆఫీసర్లకు లంచాలు ఇయ్యంది పనికాకపోతుండే. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆఫీసుల చుట్టూ తిరుగాలె. చెప్పులే అరుగుతయి తప్ప పనులుగావు.
– జక్కుల జంగయ్య, ఉప్పరిగూడ, ఇబ్రహీంపట్నం
ధరణి తీసేస్తే మళ్లీ ఎన్కటి లెక్క బ్రోకర్ల పెత్తనం పెరుగుతది. మా భూమి మాకు తాత నుంచి కావాలంటే 20 ఏండ్లు పట్టింది. ధరణి వచ్చినంకనే మాకు భరోసా వచ్చింది. పహాణీ కావాలంటే పట్వారీల దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. పని అయితలేదంటే బ్రోకర్లు వచ్చి ఖర్చు అయితదని చెప్పేటోళ్లు. ధరణి తీసేస్తే మళ్లీ భూ తగదాలు వస్తయ్. తన్నుక సచ్చుడు అయితది. గతంలో పట్వారీలు కాస్తులో ఒకడుంటే కబ్జాలో ఒకని పేరు రాసిండ్రు. భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుందామంటే అప్పుడు పాస్ బుక్ లేక భూమి కాగితాల కోసం వీఆర్వోల చుట్టూ తిరుగుడుకే రోజులు పోయేవి. రిజిస్టర్ అయినా మ్యుటేషన్ కోసం 45 రోజుల సమయం పట్టేది. ఒకవేళ మర్చిపోతే రిజిస్ట్రేషన్ అయిన భూమికి పాస్ బుక్ రాకపోయేది. పాస్ పుస్తకాల్లో వాళ్ల ఇష్టం వచ్చినట్లు రాసేటోళ్లు. పాత పద్ధతి అంటే మళ్లీ బ్రోకర్లను తీసుకువచ్చి రైతులను పీక్కతినుడే. రైతుల ఉసురు పోసుకునేందుకే కాంగ్రెసోళ్లు ధరణిని రద్దు చేస్తామంటుండ్రు. రైతులకు మేలు జరుగుతుంటే కాంగ్రెస్ నాయకులకు కండ్ల మంటగా ఉంది.
-పోతుగంటి నరేందర్రెడ్డి, రైతు, ఎన్సాన్పల్లి గ్రామం (సిద్దిపేట జిల్లా)
ఇప్పుడు వి రాసత్ కావాలం టె అద్దగంటల అయిపోతుంది.. కాంగ్రెస్ హ యాంల కనీసం ఐదారు నెలలు పట్టేది. నా భార్య చనిపోయిన తర్వాత భూమి నా పేరు మీదకు మార్చుకోవాలంటె అప్పటిదప్పుడు అయిపోయింది. మరి కాంగ్రెస్, బీజేపీలు మేమొస్తే ధరణి తీసేస్తమంటున్నరుగానీ… ధరణి తీసేస్తే ఎన్కటి పరిస్థితులే వస్తయ్. గతంలో మ్యుటేషన్ అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. ప ట్వారీలు, ఎమ్మార్వోలు సతాయించేది. ధరణి వచ్చినంక ఒక్క క్లిక్తో ఆ బాధల న్నీ తీరిపోయినయ్. మా భార్య చనిపోయిన తర్వాత వారంలోగా రైతు బీ మా వచ్చింది. నేనెవరి సుట్టూ తిరగలేదు.
– మొద్దు అంజిరెడ్డి, ఉప్పరిగూడ, ఇబ్రహీంపట్నం (రాష్ట్రస్థాయి ఉత్తమ రైతు అవార్డు గ్రహీత)
మా నాయన పేరు మీద ఎకరం 15 గుంటల భూమి నాలుగైదు సర్వేనెంబర్లల్ల ఉండేది. ఆయన చనిపోయినంక మా అమ్మ పేరు మీదకొచ్చింది. ఆ పని జల్దినే అయింది. కానీ… పదమూడు గుంటలు మాయమైంది. పెద్ద మనుషులను తీస్కపోతే పట్వారీ పాసు బుక్కుల ఎకరం 15 గుంటలు రాసిండు. కానీ రికార్డులకు మాత్రం ఎక్కియ్యలె. విరాసత్ కింద ఎకరం రెండు గుంటలే రాసిండు. నాలుగైదు ఏండ్లు తిరిగి తిరిగి యాష్టకొచ్చింది. 13 గుంటల భూమి కోసం మస్తు తిరిగినం. ఇగ ఆశ వదులుకున్నం. పదిహేను రోజుల కిందట మా అమ్మ పేరు మీద నుంచి మేం ఇద్దరం అన్నదమ్ములం 21 గుంటలు, 21 గుంటలు చేస్కున్నం. తొందరగ పనైంది. ఆ నాడే ధరణి లెక్క ఉంటె ఆ 13 గుంటల పోయి ఉండేది కాదు.
– నర్కూడ ఎల్లయ్య, ఉప్పరిగూడ, ఇబ్రహీంపట్నం
పద్దెనిమిదేండ్ల కిందట మా నాయన నుంచి నాకు ఎకరంన్నర భూమి వచ్చింది. ఇటీవల ధరణిల కొత్త పాసు పుస్తకం తీసుకొన్నా. ధరణి సిస్టం బాగుంది. కాంగ్రెస్ హయాంల బ్యాంకు లోను తీస్కోవాలంటే పట్వారీ, ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరిగేటోళ్లం. 1994-95 పహాణీ అడిగేది. దాని కోసమే 10-15 రోజులు పనులు వదులుకొని తిరిగేది. పట్వారీ యమ తిప్పిచ్చుకొనేది. ఇప్పుడా బాధ లేదు. అంతా ఆన్లైన్ అయిపోయింది. అప్పటికప్పుడు తీస్కుంటున్నం. మరి ఇంతమంచి ధరణితోటి కాంగ్రెసోళ్లకు ఏం బాధైతున్నదో మాకు అర్థమైతలేదు.
– జంగారెడ్డి, ఉప్పరిగూడ, ఇబ్రహీంపట్నం
ధరణి రైతుల పాలిట భరణిగా మారింది. కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే ధరణిని తీసివేస్తం అంటున్నరు. 60 ఏండ్లుగా రైతులకు ఏమీ చేయనోళ్లు ఇప్పుడు అది చేస్తం.. ఇది తీసేస్తం అని చెప్పుకోవడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులను చెడగొట్టడానికే ప్రతిపక్షాలు చూస్తున్నయ్. ధరణి వచ్చిన తర్వాత భూముల సమస్యలన్నీ పరిష్కారమవుతున్నయ్. గతంలో పొలం కొనడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం అంత ముఖ్యం అనే భావన రైతుల్లో ఉండేది. కానీ ధరణి వచ్చిన తర్వాత గుంట భూమిగూడా పోతలేదు. ఏ పైరవీ లేకుండా రిజిస్ట్రేషన్లు అయితున్నయ్.
-నాయికోటి శ్రీనివాస్, పాపన్నపేట, మెదక్ జిల్లా
మా ఆయన చనిపోయిండు. నేను కాలు ఇరిగి పడిన. ఎకరం భూమి ఉన్నందుకు మాకు రైతు బీమా వచ్చింది. మా ఆయన చనిపోయిన తర్వాత దినకర్మ కాకముందే ఉప సర్పంచ్కు ఆధార్ కార్డు, డెత్ సర్టిఫికెట్, భూమి కాగితాలు జిరాక్స్ ఇచ్చినం. ఎవ్వరి దగ్గరికి పోలే. ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరగలే. వారం కిందట అకౌంట్ల రూ.5 లక్షలు పడ్డయని మెసేజ్ అచ్చింది. ధరణివల్లే ఆఫీసుల సుట్టూ తిరగకుండానే బీమా పైసలు వచ్చినయ్. ఇంతమంచి సౌలత్ ఉన్న ధరణిని కాంగ్రెసోళ్లు ఎందుకు తీసేస్తమని మాట్లాడుతున్నరో వారికే తెలియాలె.
-పద్మ, ఉప్పరిగూడ, ఇబ్రహీంపట్నం