హైదరాబాద్, మే7 (నమస్తే తెలంగాణ): వానకాలంలో బరాజ్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు గేట్లన్నీ తెరిచిపెట్టాలని, దెబ్బతిన్న, కొట్టుకుపోయిన సీసీ బ్లాక్లను రిప్లేస్ చేయాలని ఇరిగేషన్శాఖకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ సూచించింది. వానాకాలంలోగానే సిఫారసులను అమలు చేయాలని, ఆ మేరకు నిధులు, డ్రాయింగ్లను సమకూర్చుకోవాలని స్పష్టంచేసింది.
మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ కుంగుబాటు, అన్నారం (పార్వతీ), సుందిళ్ల (సరస్వతీ) బరాజ్ల్లో సీపేజీలపై సాంకేతిక అధ్యయనం చేసి, చేపట్టాల్సిన పునరుద్ధరణ పనులను, తీసుకోవాల్సిన నివారణ చర్యలను సిఫారసు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభు త్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి (ఎన్డీఎస్ఏ)కి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఎన్డీఎస్ఏ ప్రత్యే క నిపుణుల కమిటీని నియమించి నాలుగు నెలల్లో నివేదికను అందజేయాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో సదరు కమిటీ మార్చి 6,7,8,9 తేదీల్లో, ఆ తరువాత 20,21,22 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించింది. స్వయంగా వెళ్లి 3 బరాజ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో, నిర్మాణ ఏజెన్సీలు, భాగస్వాములైన అధికారులతోనూ భేటీ అయ్యింది. బరాజ్ల నిర్మాణ డిజైన్లు, తదితర డాక్యుమెంట్లను ఇరిగేషన్ అధికారులను అడిగి తీసుకున్నది.
ఇరిగేషన్శాఖ విజ్ఞప్తి మేరకు బరాజ్ల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచిస్తూ తాజాగా నిపుణుల కమిటీ మధ్యంతర మార్గదర్శకాలను జారీ చేసింది. నిపుణుల కమిటీ సిరఫాసులను ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్జైన్ రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్బొజ్జాకు పంపించారు.
మేడిగడ్డ బరాజ్ను 2019 జూన్లో ప్రారంభించారని, నాటి నుంచి నీటిని నిల్వచేస్తున్నారని, ఆ మొదటి సంవత్సరం వచ్చిన వరదలకే బరాజ్ దిగువనున్న సీసీ బ్లాక్లు, ఆప్రాన్ దెబ్బతిన్నాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టకుండా యథావిధిగా బరాజ్లో నీటినిల్వ చేసి ఉపయోగించారని, ఇదే కుంగుబాటునకు కారణమని కమిటీ వెల్లడించింది.
నిపుణుల కమిటీ మధ్యంతర సిఫార్సులు
కుంగుబాటుకు గురైన 7వ బ్లాక్కు గురించి: మేడిగడ్డ బ్యారేజీలోని 85 రేడియల్ గేట్లలో 77 గేట్లు యథావిధిగా పనిచేస్తున్నాయి.కుంగుబాటునకు గురైన 7వ బ్లాక్లోని 15 నుంచి 22 వరకు ఉన్న 8 రేడియల్ గేట్లు లిఫ్ట్ చేయాల్సి ఉంది. రానున్న రుతుపవనాల ప్రారంభానికి ముందే ఆ పనులు ముగించాలి.
భవిష్యత్ అధ్యయనాలపై మార్గదర్శకాలు: