హైదరాబాద్, మార్చి 28 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన రెం డురోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె మొదటి రోజు వివిధ రాష్ర్టాల్లో విజయవంతమైంది. ఎనిమిది రాష్ర్టా ల్లో సంపూర్ణ బంద్ తరహా వాతావరణం కనిపించినట్టు కార్మిక సంఘాల ఫోరం ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నట్టు తెలిపింది. బ్యాంకింగ్, బీమా, విద్యుత్తు, బొగ్గు, ఉక్కు, పోస్టల్, చమురు, టెలికం, రవాణా తదితర రంగాలకు చెందిన ఉద్యోగు లు సమ్మెలో పాల్గొన్నారు. పలు నగరాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. బ్యాంకులు బోసిపోయి కనిపించాయి. కార్మికులు, ఉద్యోగులు కదం తొక్కుతూ పలుచోట్ల భారీ ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ యత్నాలను కేం ద్రం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాం కులు, బీమా సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నాలను నిలిపివేయాలని నినదించారు. హర్యా నా, ఛత్తీస్గఢ్లో ఎస్మా ప్రకటించినప్పటికీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ర్టాల్లో సమ్మె ప్రభావం ఎక్కువగా కనిపించింది. కేరళలో ప్రజా రవాణాతోపాటు ఆటోలు, ప్రైవేటు బస్సు లు కూడా నడవలేదు. బొగ్గు, సెయిల్, ఎన్ఎండీసీకి చెందిన వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో బొగ్గు, ఉక్కు ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, టీఏడీజేఏసీ, ఐఎన్టీయూ సీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, టీఏడీఎస్ సంఘాల ఆధ్వర్యంలో భారత్బంద్ జరిగింది. ఈ ఆందోళనకు టీఆర్ఎస్కేవీ, టీఆర్ఎస్ మద్దతు తెలిపాయి.
వివిధ జిల్లాల్లో ర్యాలీలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బ్యాంకులు మూతపడ్డాయి. ఎల్ఐసీ కార్యాలయాలు, పోస్టాఫీసుల ఎదుట ఉద్యోగులు ధర్నా చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్చెరులో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిజామాబాద్లో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, కార్మికులు విధులను బహిష్కరించి నిరసన ప్రదర్శనలు చేశారు. భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పెట్రోలు బంకులు మూసి ఉండటంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. సింగరేణి పరిధిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన సమ్మెకు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు మద్దతుగా నిలిచాయి. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వామపక్ష పార్టీలతోపాటు వివిధ ఉద్యోగ, ప్రజా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెకు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. నల్లగొండ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్కేవీతోపాటు వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. బ్యాంకులు, ఎల్ఐసీ, పోస్టాఫీసుల ఎదుట ఉద్యోగులు, కార్మికులు ధర్నా చేయగా ఆటో కార్మికులు బంద్ పాటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
రాష్ట్రంలో విజయవంతం
కార్మికుల చట్టాల సవరణ, ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ, పీఎఫ్ వడ్డీ రేట్లు తగ్గింపు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరల పెంపునకు నిరసనగా రాష్ట్రంలో సార్వత్రిక సమ్మె మొదటి రోజు విజయవంతమైంది. పలు జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన భారీ ర్యాలీల్లో కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్లో బ్యాంకులు, బీమా సంస్థలు, విద్యుత్తు కార్యాలయాల వద్ద ధర్నా ప్రదర్శన నిర్వహించారు. కవాడిగూడలోని భారతీయ జీవిత భీమా సంస్థ డివిజనల్ కార్యాలయం, కోఠి బ్యాంక్ స్ట్రీట్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ట్రాన్స్కో జోనల్ కార్యాలయం, మింట్ కాంపౌండ్లో విద్యుత్తు ఉద్యోగులు మహా ధర్నా నిర్వహించారు. విద్యానగర్లోని కేంద్ర కార్మికశాఖ ప్రాంతీయ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబు యాదవ్, ఇతర కార్మికులు పాల్గొన్నారు.