హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికైన హరితహారం కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం వేళ ప్రతీ ఒక్కరూ సరిహద్దుల్లో వీర జవానుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని సూచించారు. వారి స్ఫూర్తితో అభివృద్ధికి పునరంకితం కావాలని కోరారు.
హరితహారం విజయవంతంలో అటవీ శాఖలో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం ఉందని అన్నారు. అడవుల రక్షణ విషయంలో క్షేత్ర స్థాయి సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా గత యేడాది కాలంలో పనితీరులో ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్న అధికారులు, సిబ్బందికి ఆయన ప్రోత్సాహకాలను అందజేశారు.