హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ) ః ఆ ముగ్గురు పుట్టింది తెలుగు నేలపైనే.. శాసించింది మాత్రం భారతావనిని. జాతీయ స్థాయిలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచిన ఆ ముగ్గురూ కారణ జన్ములు. మద్రాసీయులుగా ఉన్న గుర్తింపునకు చరమగీతం పాడించిన ధీశాలి ఒకరు, దక్షిణాది అంటేనే ఉన్న చిన్నచూపును తొలగించి తెలుగోడిగానే గాక తెలంగాణ వాడిగా తన సత్తా చాటి మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్ళ పాటు నడిపించిన అనుభవశాలి మరొకరు. పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్ళు తప్ప అంటూ సుదీర్ఘ పోరాటం ద్వారా దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసి, నేడు దేశానికి దశాదిశ నిర్దేశిస్తున్న ఆచరణశీలి ఇంకొకరు. జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసిన ఆ ముగ్గురు ఆత్మగౌరవ పోరాటంలో ఆరితేరిన వారు. వారే పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
పీవీ నరసింహరావు
పాములపర్తి వెంకట నరసింహరావు కంటే ముందు దేశానికి ప్రధానమంత్రులుగా పనిచేసిన వారందరూ ఉత్తరాదికి చెందిన వారు కావడం విశేషం. తొలిసారిగా దక్షిణాదికి, అది కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అయ్యారు. నంద్యాల ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించి గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కారు. కాంగ్రెస్కు పూర్తి మెజార్టీ లేకపోయినా ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించడంలో తెలుగు వారి పాలన తీరును దేశానికి చాటారు. ఆర్థిక సంస్కరణల పితామహుడిగా దేశమంతా పీవీని కొనియాడుతున్నది.
ఎన్టీ రామారావు
ఆత్మగౌరవమే పునాదిగా తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు వారికి ప్రత్యేకంగా గుర్తింపు తీసుకురావడంలో ఎన్టీఆర్ది ప్రత్యేక పాత్ర. పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఆయనది. కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేసే పని చేపట్టారు. దీని కోసం నేషనల్ ఫ్రంట్ను ఏర్పాటు చేశారు. నేషనల్ ఫ్రంట్కు కన్వీనర్గా ఆయన పనిచేశారు. దేశంలో ప్రముఖ నాయకులను హైదరాబాద్ బాట పట్టే విధంగా చేశారు. వీపీ సింగ్, చంద్రశేఖర్ సహా వామపక్షాల నేతలను ఒకే తాటి పైకి తీసుకువచ్చారు. జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర పక్షాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకవచ్చారు.
కే చంద్రశేఖర్రావు
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ఒప్పించి, మెప్పించిన అసలు సిసలైన రాజనీతిజ్ఞుడు కేసీఆర్. 60 ఏండ్ల కలను సాకారం చేసిన తెలంగాణ జాతిపిత కేసీఆర్. తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన నేత కేసీఆర్. జాతీయ రాజకీయాల్లో ఇలాంటి నేత ఉంటే దేశం మొత్తం బాగుపడుతుందన్న ప్రజాభీష్టం మేరకు టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు కేసీఆర్. దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి అన్ని రాజకీయ పార్టీలను ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కేసీఆర్ ప్రయత్నాలకు కమ్యూనిస్టులు, ఆమ్ఆద్మీ పార్టీ, సమాజ్వాది పార్టీ, జేడీఎస్, ఆర్జేడీ లాంటి పార్టీలు ఇప్పటికే సుముఖతను వ్యక్తం చేశాయి. తమ మద్దతును ప్రకటించాయి. దేశంలో పలు కీలక రైతు సంఘాలు, యువజన, విద్యార్థి సంఘాలు తమ మద్దతును ప్రకటించాయి. ఒకప్పుడు ఉప ప్రాంతీయ పార్టీ అంటూ ఎద్దేవా చేసిన నేతలే నేడు కేసీఆర్ ను జాతీయ స్థాయి నేతగా ఆమోదిస్తున్నారు.