JEE Main | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ -1 పరీక్షలో ఆరు ప్రశ్నలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఉపసంహరించింది. ప్రశ్నల్లో లోపాల కారణంగా ఆయా ప్రశ్నలను తొలగించింది. అయితే ఇవి ఒకే సెషన్లో కాకుండా వివిధ సెషన్లలో ఉన్నాయి. తొలగించిన ఆరు ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలే కావడం విశేషం. జేఈఈ మెయిన్ -1 పరీక్షలను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.
జనవరి 27న రెండోషిప్ట్లో, 29న మొదటి షిప్ట్లో, 30, 31న రెండోషిఫ్ట్లో ఒకటి చొప్పున మొత్తం నాలుగు ప్రశ్నలు, ఫిబ్రవరి 1న రెండో షిప్ట్లో రెండు ప్రశ్నలను ఉపసంహరించారు. దీంతో మొత్తం మీద ఆరు ప్రశ్నలను ఎన్టీఏ తొలగించింది. ఇక మరో 16 ప్రశ్నలకు ప్రాథమిక ‘కీ’లో ఇచ్చిన సమాధానాలను ఫైనల్ ‘కీ’లోకి మార్చింది. ఈ ‘కీ’లో మార్పులు చేసిన ఫలితంగా పలువురు విద్యార్థులు ఒకటి రెండు మార్కుల తేడాతో 300కు 300 వచ్చే మార్కులను కోల్పోయారు.