హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలలో ఒక్కదాన్ని కూడా నెరవేర్చని ప్రధాని మోదీ ఏం మొఖం పెట్టుకొని రాష్ర్టానికి వస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం కక్షసాధింపుతో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. సోమవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉపాధిహామీ కౌన్సిల్ సమావేశంలో సహచర మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ర్టానికి న్యాయంగా రావాల్సిన నిధులు కూడా విడుదలచేయడంలేదని మంత్రి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని, గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పిన మోదీ.. ఇప్పుడు వాటిని భరించలేని స్థాయికి పెంచారని ఆరోపించారు. గ్యాస్ బండ ధరను రూ.400 నుంచి రూ. 1100 వరకు పెంచేశారని, పెట్రో ధరలను అడ్డగోలుగా పెంచి.. దేశమంతా నిరసన వ్యక్తం చేసేసరికి మొక్కుబడిగా తగ్గించి రాష్ర్టాలను తగ్గించాలని అడుగుతున్నారని ధ్వజమెత్తారు. బ్యాంకు ఖాతాలు తెరిస్తే నల్ల ధనాన్ని తెచ్చి.. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పిన మోదీ.. బ్లాక్ మనీని తెచ్చారా? డబ్బులు వేశారా? అని నిలదీశారు. బ్యాంకులకు కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన వారు విదేశాలకు పారిపోతే.. వారిని వెనకకు తీసుకురావడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు.
ఆర్థిక సంఘం నిధుల్లో కోత
ఆర్థిక సంఘం ద్వారా రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధుల్లో రూ.1830 కోట్ల నిధుల్లో కేంద్ర కోత పెట్టిందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. అందువల్లే గ్రామాలకు నిధుల విడుదల ఆలస్యమైందని పేర్కొన్నారు. పంచాయతీలకు కేంద్రంతో సమానంగా రాష్ట్రం కూడా నిధులను విడుదల చేస్తున్నదని, సర్పంచ్లు వాస్తవాలను గ్రహించి ఓపిక పట్టాలని సూచించారు. సర్పంచ్ల కృషితోనే గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా మారాయని తెలిపారు. రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు చెల్లించకపోగా, రాష్ట్రాన్ని బద్నాం చేస్తున్నారని, అవగాహన లేకుండా బండి సంజయ్ వంటి నేతలు మాట్లాడుతున్నారని దయాకర్రావు విమర్శించారు. కూలీల చెల్లింపులూ పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వాటిని ఇచ్చేది కూడా కేంద్రమేనని, రాష్ట్రం కాదని.. వీటిపై కనీస జ్ఞానం లేనివారు మాట్లాడే మాటలకు విలువలేదని తెలిపారు. సర్పంచ్ల కృషి తోనే గ్రామాలు ఆదర్శంగా మారాయన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడం వల్ల మాత్రమే సమస్య వచ్చిందని, దాని పరిష్కారానికి కృషిచేస్తున్నామని పేర్కొన్నారు. ఉపాధిహామీలో 16 కోట్ల పనిదినాలను అడిగితే 10 కోట్ల పనిదినాలను మాత్రమే ఇచ్చారన్నారు.
వ్యవసాయానికి ఉపాధిహామీని అనుసంధానించాలి
ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఉపాధిహామీ ఎగ్జిక్యూటివ్ సమావేశం(ఈసీ) లో మరోసారి తీర్మానించామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. రాష్ట్రానికి 16 కోట్ల ఉపాధి హామీ పనిదినాలను మంజూరుచేయాలని కోరామన్నారు. ఎస్సీ, ఎస్టీ కూలీలకు ప్రత్యేకంగా పనిదినాలివ్వాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానించారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ చేసుకునే వీలుకల్పించాలని, ఉపాధి హామీ పని జరిగే ప్రాంతాల్లో ఫొటోలు తీసి, పంపించే ఇబ్బందికర చర్యలను వెనక్కి తీసుకోవాలని కోరినట్టు వెల్లడించారు. ఇప్పటికే బకాయిలుగా ఉన్న రూ.97 కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎండ వేడి, వడ్ల కొనుగోలు, ఉపాధి హామీ పనులు జోరుగా జరగటం వంటి కారణాలతో పల్లె ప్రగతిని జూన్ 3కు వాయిదా వేయాలని కలెక్టర్లు విజ్ఞప్తి చేయడంతో సీఎం కేసీఆర్ వాయిదా వేశారని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన పంచాయతీ భవనాలకు రూ.600 కోట్లు బడ్జెట్లో కేటాయించామని తెలిపారు. వీటి ద్వారా 2400 భవనాలను నిర్మిస్తామన్నారు. తండాలకు పక్కా రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం వేయి కోట్లు కేటాయించిందని చెప్పారు.