నారాయణపేట : అధికార పార్టీ అండదండలతో కృష్ణా నదిలో ఇసుక దందా చేస్తున్న మాఫియా ( Sand Mafia ) గుట్టు రట్టు చేసేందుకు వెళ్లిన నమస్తే తెలంగాణ ( Namasthe Telangana ) మాగనూరు విలేకరి రాము( Ramu ) , ఫోటోగ్రాఫర్పై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. కృష్ణ మండలం గుడెబల్లూరు సమీపంలోని కృష్ణా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఆ న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన విలేకరి, ఫోటోగ్రాఫర్పై మాఫియా అడ్డుకొని దాడికి పాల్పడింది.
కాంగ్రెస్ నేత వాకిటి నారాయణతో పాటు మరి కొంతమంది అనుచరులు కలిసి ఈ దాడికి పాల్పడ్డారు. ప్రతిరోజు కృష్ణానది నుంచి వందల టిప్పర్లతో సరిహద్దులు దాటిస్తున్నా , ఇది అక్రమమని తెలిసినా కూడా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని మండల వాసులు ఆరోపిస్తున్నారు. రిపోర్టర్ల పై దాడికి దిగిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి.