Telangana | ఒకప్పుడు ఎడారి ప్రాంతాన్ని తలపించిన తెలంగాణ.. ఇప్పుడు నీటి సంరక్షణలో ఇతర రాష్ర్టాలకు ఎలా ఆదర్శంగా నిలిచిందన్న విషయం తెలుసుకోవడానికి సిద్ధమయ్యా. కేంద్రప్రభుత్వం నయాపైసా సాయం చేయకపోయినప్పటికీ, తెలంగాణ స్వతహాగా కేవలం ఐదేండ్లలోనే ఈ ఫీట్ ఎలా సాధించిందో తెలుసుకోవాలన్న ఆసక్తి నాలో కలిగింది. అందుకే 13 రోజులపాటు, 2,500 కిలోమీటర్ల మేర రాష్ట్రంలో పర్యటించా. రాష్ట్రంలోని ప్రతీపల్లెలో జలసవ్వడులను చూసి అబ్బురపడ్డా..
అంటూ ప్రముఖ జర్నలిస్ట్, నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ ఇంద్ర శేఖర్సింగ్ ‘వైర్’లో రాసిన ప్రత్యేక కథనం ఇది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ‘జల్ జీవన్ మిషన్’ గురించి కేంద్రం పెద్దయెత్తున ప్రచారం చేసింది. ఈ పథకం కింద భారీయెత్తున నిధులు మంజూరయ్యాయి. అయినప్పటికీ, దేశంలోని అనేక రాష్ర్టాలు ఇప్పటికీ నీటి కటకటను ఎదుర్కొంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ప్లాస్టిక్ పైపుల తయారీ ప్రక్రియ అయితే పెద్దయెత్తున ఊపందుకున్నది గానీ, ప్రజలు ఎదుర్కొంటున్న దాహార్తి సమస్య మాత్రం తీరలేదు.
ఈ విషయాన్ని చాలా మంది నిపుణులు కూడా చెప్పారు. విచ్చలవిడిగా నీటిని తోడటం, కాలుష్యం కారణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. అయితే, ఒకప్పుడు ఎడారి ప్రాంతాన్ని తలపించిన తెలంగాణ.. ఇప్పుడు నీటి సంరక్షణలో ఇతర రాష్ర్టాలకు ఎలా ఆదర్శంగా నిలిచిందన్న విషయం తెలుసుకోవాలనుకొన్నా. కేంద్రప్రభుత్వం నయాపైసా సాయం చేయకపోయినప్పటికీ, తెలంగాణ స్వతహాగా కేవలం ఐదేండ్లలోనే ఈ ఫీట్ ఎలా సాధించిందో తెలుసుకోవాలన్న ఆసక్తి నాలో కలిగింది.
రాష్ట్రంలోని ప్రతీఇంటికి నల్లాల ద్వారా సురక్షిత తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ జల్శక్తి మంత్రి సాక్షాత్తు పార్లమెంట్లోనే చెప్పారు. దీంతో అదెలా సాధ్యమైందో.. ప్రత్యక్షంగా పర్యటించి తెలుసుకోవాలనుకొన్నా. మంత్రి స్టేట్మెంట్ను పరీక్షించడానికి 13 రోజులపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2,500 కిలోమీటర్ల మేర పర్యటించా. ఎర్రమట్టి నేలలు ఎక్కువగా ఉండే జహీరాబాద్, సంగారెడ్డి, ఖమ్మం, అశ్వారావుపేట, మేడిగడ్డలోని లక్ష్మీబరాజ్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లోని సరస్సులు, చెరువులు.. ఇలా నా క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగింది. గోదారి నీటిని తాకా. మున్నేరు నదిలో ఈత కొట్టా. గ్రామాల్లోని వేలాది చెరువులు, బావుల్లోని నీటిని తాగా. రామప్ప ఆలయంలో ప్రార్థనలు చేశా.
గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత.. తెలంగాణలో నీటిని ఎలా సంరక్షించుకొంటున్నారో తెలుసుకోవాలనుకొన్నా. ఇంటింటికీ సురక్షిత తాగునీటిని నల్లాల ద్వారా అందిస్తున్న మిషన్ భగీరథ, రాష్ట్రవ్యాప్తంగా జలసవ్వడులకు కారణంగా నిలిచిన ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంను సందర్శించా. తొలుత రంగనాయక లిఫ్ట్ పంపింగ్ స్టేషన్కు వెళ్లా. భూగర్భంలో 150 అడుగుల లోతులో ఉన్న లిఫ్ట్ పంపింగ్ స్టేషన్ను చూసి ఆశ్చర్యపోయా. అదో ఆధునిక ఇంజినీరింగ్ అద్భుతం. తర్వాత ఈ స్టేషన్కు అనుసంధానమై నీలివర్ణంలో నిండుకుండలా నీటితో తొణికిసలాడుతున్న పలు రిజర్వాయర్లను వీక్షించా. ఇక్కడ ఒక విషయం చెప్పాలి.
తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించడానికి ముందే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సిద్దిపేటలో రూ.100 కోట్లతో ప్రాజెక్టు భగీరథకు శంకుస్థాపన చేశారు. దిగువ మానేరు డ్యామ్ నుంచి సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని 180 గ్రామాల్లోని అన్ని ఇండ్లకు నల్లా నీళ్లు వచ్చేలా చేశారు. అనంతరం ఇదే నమూనాను రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చారు. కృష్ణ, గోదావరి నదీ జలాలను బరాజ్లు, పైప్లైన్లు, పంపింగ్ స్టేషన్లతో అనుసంధానించి ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతీ ప్రాంతానికి నదీ జలాలు అందేలా చేశారు. ఇలా యావత్తు తెలంగాణ జలసవ్వడులతో నిండింది.
ఇంటింటికీ నల్లా నీటిని సరఫరా చేయడం కోసం ప్రతీ గ్రామంలో.. నిర్ణీత ఎత్తులో నిర్మించిన ఓ పెద్ద నీటి ట్యాంకులో శుద్ధి చేస్తున్న నీటిని నింపుతున్నారు. తగిన సమయాల్లో నల్లాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వాటర్ ఓవర్ ఫ్లో, వృథాను అరికట్టేందుకు ‘స్టాప్ చెక్’ సదుపాయం ఉండటం బాగున్నది. ఇలాంటి ప్రాజెక్టుల వల్లే, తమ గ్రామంలో నీటి కరువు అన్న ఊసే లేదని గజ్వేల్ సర్పంచ్ శేఖర్ పటేల్ (43) చెప్పారు. ‘తాగునీటి కోసం గతంలో ప్రతీ ఇంట్లో ఓ మహిళ పనులన్నీ మానుకొని ఎక్కడికో వెళ్లి నీళ్లు తీసుకురావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధలు లేవు’ అని ఆనందంగా చెప్పాడు.
దాదాపుగా ఇవే అభిప్రాయాలను ఇక్కడి రైతులు కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో నీటిఎద్దడి ఉండటంతో రైతులు మినుములు, పప్పులను పండించేందుకే అవస్థలు పడేవారు. ఇప్పుడు పరిస్థితులు ఎంతో మారాయి. చెరుకు, వరి, పత్తి ఇలా అన్ని పంటలను రైతులు పండిస్తున్నారు. దీనికి కారణం కాళేశ్వరం జలాలే. ఇంజినీరింగ్ అద్భుతాలను చూశాక.. రామప్ప గ్రామానికి వెళ్లా. యునెస్కో వారసత్వ గుర్తింపు పొందిన ఆలయమది. ఆలయం వెనుక మధ్యయుగాల కాలంలో రెండు కొండలను కలుపుతూ నిర్మించిన విశాలమైన రామప్ప సరస్సును చూశా. ఆ సరస్సు ఒడ్డున తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీ ప్రకాశ్ నా కోసం ఎదురుచూస్తూ కనిపించారు. నీటి సంరక్షణపై తీసుకొన్న నిర్ణయాలు, తెలంగాణ ఉద్యమకాలం నుంచి కేసీఆర్తో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం వల్ల వీ ప్రకాశ్ గురించి నాకు అప్పటికే బాగా తెలుసు.
‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రతీగ్రామానికి సురక్షితమైన తాగునీటిని ఏ రాష్ట్రమూ సరఫరా చేయలేదు. తెలంగాణ మాత్రమే ఈ రికార్డును సాధించింది. 2017-18 మధ్య ఈ ఘనత సాకారమైంది. కేంద్రం నిధులు విడుదల చేయకపోయినప్పటికీ, తెలంగాణ ఈ ఫీట్ సాధించింది. సీఎం కేసీఆర్ విజన్, తెలంగాణ ప్రజల శ్రమ వల్లే ఇది సాధ్యమైంది’ అని రావు నాతో చెప్పారు. అప్పుడే ప్రధాని మోదీకి సంబంధించి నాకో అనుమానం వచ్చింది. దీంతో ‘భగీరథ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారుగా.. అయినప్పటికీ, కేంద్రం నుంచి నిధులు రాలేదా?’ అని నేను రావును అడిగా. రావు ఈ విధంగా సమాధానమిచ్చారు.
‘ప్రధాని తెలంగాణకు వచ్చారు. ప్రాజెక్టు గురించి పార్లమెంట్లో ప్రశంసల వర్షం కురిపించారు. మోదీనే కాదు. 11 రాష్ర్టాలకు చెందిన ప్రతినిధులు ( చాలావరకూ బీజేపీపాలిత రాష్ర్టాలే) తెలంగాణకు వచ్చి భగీరథ ప్రాజెక్టును వీక్షించారు. అయినప్పటికీ, మిషన్ భగీరథకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వట్లేదు. అయినా 99 శాతం వరకు పూర్తయ్యాయి. రాష్ట్రమంతటా నీటి సరఫరా జరుగుతున్నది. బ్యాంకుల నుంచి రుణాలను తీసుకొచ్చే ఇవన్నీ పూర్తిచేశాం. ఇకపై తెలంగాణ ప్రజలు దాహంతో ఎప్పటికీ అలమటించరు’ అని రావు అన్నారు.
వీ ప్రకాశ్ మాట్లాడుతూ.. ‘కేంద్రప్రభుత్వం తెలంగాణ మిషన్ భగీరథ ప్రాజెక్టును కాపీ కొట్టే.. జల్ జీవన్ మిషన్ను తీసుకొచ్చింది. అయితే, జల్ జీవన్ మిషన్లో లాగా కేవలం గ్రామాల్లో పైపులను మాత్రమే వేసి మేం వదిలిపెట్టలేదు. ఆ పైపుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. అలాగే ఆ పైపులకు ఆప్టికల్ ఫైబర్ వంటి 16 కేబుల్స్ను కూడా అమర్చాం. దీంతో ఒక్క మిషన్ భగీరథ పైప్లైన్తో నీరు, ఇంటర్నెట్, ఫోన్ ఇలా అత్యవసరమైన 16 రకాల సేవలను గ్రామగ్రామానికి విస్తృతపరిచాం. ఈ మిషన్లో భాగంగానే 28 వేల చెరువులు, కుంటలను మరమ్మతులతో అభివృద్ధి చేశాం. హైడ్రాలజీ మ్యాపింగ్, రెయిన్ ఫాల్ డాటా వంటి సేవల కోసం మాత్రమే కేంద్రం ద్వారా వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు వస్తున్నాయి.
అయితే, తెలంగాణ ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఈ అత్యవసర ప్రాజెక్టులకు మాత్రం నిధులు రావట్లేదు’ అని రావు పేర్కొన్నారు. నీరు వృథా కాకుండా ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలేంటని నేను ప్రశ్నించా.. ‘నీటి వృథాను అరికట్టేందుకు ఎన్నో స్టాప్-చెక్స్ను పెట్టాం. దీంతో నీరు వృథా కాకపోవడంతో పాటు అన్ని ఇండ్లకు సరిపడినన్ని నీళ్లు వస్తాయి. వ్యవసాయ దిగుబడులు పెంచేందుకు క్రాప్ కాలనీ క్లస్టర్లను ప్లాన్ చేస్తున్నాం. మినుములు, పప్పుల పంటలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు నీటి వృథాను అరికట్టేందుకు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజల్లో నీటి క్రమశిక్షణ అలవరిచేలా కృషిచేస్తున్నాం. ఈ అత్యుత్తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రజలందరూ ప్రభుత్వానికి తోడుగా నిలుస్తారని భావిస్తున్నా’ అని రావు చెప్పారు. దీంతో నా పర్యటన సంపూర్తిగా ముగిసింది. తిరుగు ప్రయాణమయ్యా.
ఎర్రమట్టి నేలలు ఎక్కువగా ఉండే జహీరాబాద్, సంగారెడ్డి నుంచి ఖమ్మం, అశ్వారావుపేట, మేడిగడ్డలోని లక్ష్మీబరాజ్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లోని సరస్సులు, చెరువులు.. ఇలా నా క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగింది. గోదారమ్మ నీటిని ముట్టుకున్న. మున్నేరు నదిలో ఈత కొట్టా. గ్రామాల్లోని వేలాది చెరువులు, బావులు, నల్లా నీటిని తాగా. రామప్ప ఆలయంలో ప్రార్థనలు చేశా.
– ఇంద్ర శేఖర్ సింగ్
ఆర్టికల్, వీడియో లింక్: https://thewire.in/environment/how-telanganas-age-old-thirst-was-quenched