హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడేది లేదని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. డ్రగ్స్, పేకాట క్లబ్బులు, మట్కాలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని చెప్పారు. శుక్రవారం రవీంద్రభారతిలో ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి గత రెండేండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన 669 పతకాలను డీజీపీ మహేందర్రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని అన్నారు.
పోలీస్ శాఖకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, శాఖాపరంగా మౌలిక సదుపాయాల కల్పన, ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానం, వాహనాల కొనుగోలు, పోలీస్ స్టేషన్ల భవనాల నిర్మాణం, పోలీస్ నియామకాలకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నారని వివరించారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటంతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వెల్లడించారు.
డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ఈ పతకాల స్ఫూర్తితో మరింత అంకితభావంతో పనిచేయాలని పోలీసులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, ఏసీబీ డీజీ అంజనీకుమార్, అడిషనల్ డీజీలు, ఐజీలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందజేసిన పతకాల జాబితాలో కేంద్రం ప్రకటించిన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్లతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే శౌర్య, మహోన్నత సేవ, ఉత్తమ సేవ, కఠిన, సేవ పతకాలు ఉన్నాయి.