హిమాయత్నగర్, మార్చి 16: హక్కులను కాలరాస్తూ మాలలకు అన్యాయం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే సహించేది లేదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కనుసన్నల్లో ఎస్సీ వర్గీకరణ చేసి మాలలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్రెడ్డికి తగిన సమయంలో గుణపాఠం చెప్పాలని పిలుపు ఇచ్చారు. సోమవారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసి అశాస్త్రీయంగా ఎస్సీ వర్గీకరణ చేశారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా నివేదికను సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు మాలలు దూరం అవుతున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ అనంతరం జరిగిన రోస్టర్ పాయింట్ల కేటాయింపులో మాలలకు తీరని అన్యాయం జరుగడంతో విద్య, ఉద్యోగ రంగాల్లో నష్టం వాటిలుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.