Congress | కాచిగూడ,అక్టోబర్ 28: రాష్ట్రంలో కాంగ్రెస్ రెడ్ల పార్టీగా మారిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. కాచిగూడలో బీసీ సంఘాల నాయకులతో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బీసీలకు 18 సీట్లు మాత్రమే కేటాయించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి కంటే ముందు పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న దాదాపు 16 లక్షల ఉద్యోగాలను కేంద్రం వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కులు సాధించేవరకు దేశవ్యాప్త బీసీలంతా ఏకతాటిపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఆయా డిమాండ్ల సాధన కోసం త్వరలో లక్షలాది మందితో బీసీ గర్జన బహిరంగసభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యం, కోల జనార్ధన్, నీలం వెంకటేశ్, బీసీ న్యాయవాధుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్యాదవ్, నందగోపాల్, రాజ్కుమార్, సురేశ్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.