హైదరాబాద్, మార్చి30 (నమస్తే తెలంగాణ): బీసీల సమగ్ర సామాజిక అభివృద్ధికి, మండల్ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా, కేంద్ర సహాయ మంత్రి, రిపబ్లికన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రామ్దాస్ అథవాలెను జాజుల నేతృత్వంలోని బీసీ ప్రతినిధి బృందం గురువారం కలిసి వినతిపత్రాలను అందజేసింది.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. మండల్ కమిషన్ సిఫారసుల అమలుకు, బీసీల న్యాయ పోరాటానికి అన్ని పార్టీలూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా బీసీల ఆకాంక్షలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీసీలపై కేంద్రం ఇదే వైఖరిని అవలంబిస్తే దేశంలో మరో ఉద్యమాన్ని చేపడుతామని స్పష్టం చేశారు.