Medical Colleges | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నది. జిల్లాకో మెడికల్ కాలేజీ అమలులో మరో ముందడుగు పడింది. రాష్ట్రంలోని కొత్తగా ఏర్పాటు చేసిన రెండు మెడికల్ కాలేజీలకు జాతీయ వైద్య కమిషన్ అనుమతులు జారీ చేసింది. కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వైద్య కళాశాలలకు అనుమతి ఇచ్చింది. ఆయా కళాశాలల్లో వంద సీట్ల చొప్పున ఎంబీబీఎస్ సీట్లతో అనుమతులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల్లో వైద్యసేవల బలోపేతానికి మరింత ఆస్కారం ఉంటుందన్నారు. ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనే సీఎం కేసీఆర్ ఆశయ సాధనలో ఇది మరో ముందడుగు అన్నారు. మరో ఏడు వైద్య కళాశాలల అనుమతుల ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడమే కాకుండా ఔత్సాహిక వైద్య నిపుణులకు మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు.
ఏదైనా పెద్ద వ్యాధి వస్తే.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు పరుగెత్తాల్సిన పరిస్థితి. వందల కిలోమీటర్ల పాటు ప్రయాణించి హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి. మరో వైపు వైపు నిరుపేదలు, మధ్య తరగతి విద్యార్థులకు అందని ద్రాక్షగా వైద్య విద్య ఉన్నది. లక్షలాది ఫీజులు పోసి చదువు‘కొన’ లేని దుస్థితి. తెలంగాణలో సూపర్ స్పెషాలిటీ సేవలను పేదలకు చేరువ చేయడంతో పాటు, వైద్య విద్యను విద్యార్థులకు అందించాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే సమయానికి ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. గాంధీ (1954), ఉస్మానియా (1946) దవాఖానలు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించే నాటికే ఉన్నాయి.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీని 1959లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆదిలాబాద్లో రిమ్స్, నిజామాబాద్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. 58 ఏండ్లలో తెలంగాణకు కేవలం మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన అనంతరం 12 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. గతేడాది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఎనిమిది మెడికల్ కాలేజీలకు ఒకేసారి ప్రారంభోత్సవం చేశారు. పలు జిల్లాల్లో ఇంకా మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో పాటు సర్వాంగ సుందరంగా భవనాలను నిర్మిస్తున్నది. అదే సమయంలో ఆయా మెడికల్ కాలేజీలు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతను తగ్గించేందుకు సైతం నర్సింగ్ కాలేజీలను సైతం ఏర్పాటు చేస్తున్న విషయం విధితమే.
In a true essence of #ArogyaTelangana, now healthcare facilities will further strengthen in rural areas, Two more medical colleges in #Telangana, Kamareddy & Komaram Bheem Asifabad districts got permission with 100 MBBS seats in each college
This is a significant step towards… pic.twitter.com/5re2Cnsy9A
— Harish Rao Thanneeru (@BRSHarish) April 8, 2023