రియో గ్రాండే డుసుల్: బ్రెజిల్(Brazil)లో వాతావరణం భిన్నంగా ఉన్నది. దక్షిణాది రాష్ట్రం రియో గ్రాండే డుసుల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ రాష్ట్రంలో మట్టిచరియలు విరిగిపడ్డాయి. ఆ ఘటన వల్ల 37 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 74 మంది ఆచూకీ లేకుండాపోయారు. ప్రస్తుతం ఆ రాష్ట్రవ్యాప్తంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇండ్లు, బ్రిడ్జ్లు కూలిన ప్రదేశాల్లో శిథిలాలను తొలగిస్తున్నారు. విచిత్ర వెదర్ వల్ల పరిస్థితులు అదుపు తప్పినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ ఎడూర్డో లీట్ తెలిపారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రభావత ప్రాంతాలకు సాయాన్ని అందించనున్నట్లు అధ్యక్షుడు లుజ్ ఇనాసియో లులా డ సిల్వా తెలిపారు.
ఫెడరల్ దళాలు సహాయ కార్యక్రమాల్లో మునిగాయి. 12 విమానాలు, 45 వాహనాలు, 12 బోట్లను రంగంలోకి దించారు. సుమారు 700 మంది సైనికులు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్లో పాల్గొంటున్నారు. మట్టిచరియల వల్ల అనేక ప్రాంతాలు మట్టిదిబ్బలుగా మారాయి. చాలా ప్రదేశాల్లో వాహనాలన్నీ ఆ మట్టిలో మునిగిపోయాయి. ఇండ్లు కోల్పోయినవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆహారం, నీరు అందిస్తున్నారు. స్థానిక గుయిబా నది ఉప్పొంగుతోంది. డేంజర్ లెవల్స్ దాటి నీరు ప్రవహిస్తోంది.