హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఆన్లైన్లోనే తరగతులు నిర్వహించాలని కేంద్రం రాష్ర్టాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ కొవిడ్ యాక్షన్ప్లాన్తోపాటు, రోడ్మ్యాప్ను ఖరారు చేసింది. ఇందుకు తగిన ఏర్పాట్లను రాష్ర్టాలు చేసుకోవాలని ఆదేశించింది. రేడియో, టీవీ, యాప్లు, పోర్టళ్లు, ఈ లైబ్రరీలు, వాట్సాప్, లౌడ్స్పీకర్లలో పాఠ్యాంశాల ప్రసారం తదితర విధానాలను అమలుచేయవచ్చని సూచించింది. నూతన విద్యా సంవత్సరాన్ని మూడు దశల్లో కొనసాగించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. అవి నిర్వహణ దశ (మెయింటనెన్స్ ఫేజ్), పునరుద్ధరణ దశ (రీస్టోర్ ఫేజ్), అభివృద్ధి దశ (గ్రోత్ ఫేజ్). ఈ దశల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల ప్రణాళికను కూడా కేంద్రం ప్రకటించింది. అయితే రాష్ర్టాలు తమ అవసరాలు, ఏర్పాట్లను బట్టి ప్రత్యేకంగా రోడ్మ్యాప్ను సిద్ధం చేసుకోవచ్చని తెలిపింది. ఆన్లైన్, డిజిటల్ క్లాసుల నిర్వహణతో పాటు, డ్రాపౌట్లు, పాఠ్యపుస్తకాల వివరాలను అందజేయాలని ఆదేశించింది. 2030 నాటికి ప్రీప్రైమరీ నుంచి సీనియర్ సెకండరీ వరకు 100శాతం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) లక్ష్యంగా నిర్దేశించుకోవాలని, ఈ దిశలో డ్రాపౌట్ల సంఖ్యను గణనీయంగా నివారించాలని పేర్కొన్నది.
పలు రాష్ర్టాల్లో అమలుచేస్తున్న ఉత్తమ విధానాలను సైతం కేంద్రం రోడ్మ్యాప్లో ఉదహరించింది. దీంట్లో తెలంగాణలో అత్యంత వేగంగా డిజిటల్ పాఠాలను తయారుచేసి, అమలు చేస్తున్న విధానం సైతం చోటు చేసుకున్నది. టీవీ పాఠాలు రూపొందించేందుకు ప్రత్యేకంగా నిపుణులతో కూడిన బృందాలను ఏర్పాటు చేయడం, వారికి శిక్షణనివ్వడం, టీవీల్లో ప్రసారం చేయడం బాగున్నట్లు కితాబిచ్చింది.