హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంతో గొల్ల, కుర్మలకు ఆర్థికంగా స్వావలంభన లభిస్తున్నదని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) ప్రశంసించింది. సుధీర్కుమార్శర్మ, ముఖేశ్కుమార్, బూపిందర్సింగ్, తెహేదూర్ రహ్మాన్, వీకే దుబాసి, శ్రీనివాసుతో కూడిన ఎన్సీడీసీ అధికారుల బృందం సోమవారం పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో భేటీ అయింది. ఈ సందర్భంగా గొర్రెల పంపిణీ పథకం గురించి మంత్రి వారికి వివరించారు. కులవృత్తులను ప్రోత్సహించడంతోపాటు, గొల్ల, కుర్మలకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. రెండు విడతల్లో కలిపి రూ.11 వేల కోట్లతో ఈ పథకాన్ని చేపట్టామని పేర్కొన్నారు. దీంతో దేశంలో గొర్రెల సంపద అధికంగా కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వివరించారు. జీవాలవద్దకే వైద్యం కోసం సంచార పశువైద్యసేవలను ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా బృంద సభ్యులను మంత్రి తలసాని సన్మానించారు. కార్యక్రమంలో పశు సంవర్ధకశాఖ కార్యదర్శి అనితరాజేంద్ర, షీప్ ఫెడరేషన్ ఎండీ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.