హైదరాబాద్, జనవరి26 (నమస్తే తెలంగాణ): పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన వాస్తు స్థపతి ఆనందాచారి కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్యాదవ్, బీసీ నేతలు కోరారు. శుక్రవారం వారు ఆనందాచారిని స్వయంగా కలిసి ఘనంగా సత్కరించారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడంపై బీసీ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ఆయన సేవలను గుర్తించి అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నిజాయితీ ఊపిరిగా జీవించిన ఆనందాచారి ప్రస్తుతం పేదరికంలో జీవిస్తున్నారని, దీనస్థితిలో ఉన్న ఆయన కుటుంబం ఉండటానికి ఇల్లు, ఆర్థికసాయం అందజేసి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాగరాజు, భిక్షపతి, మల్లేశ్, సాయివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.