Yellareddypet | ఎల్లారెడ్డిపేట, జూలై 19: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. 18 ఏండ్లుగా ఆయన చేస్తున్న సామాజిక సేవలకు జాతీయ ఖ్యాతి లభించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెక్టార్ న్యూఢిల్లీవారు ‘భారత్ అన్మోల్’ అవార్డుకు ఎంపిక చేశారు.
ఆయన ప్రజాప్రతినిధిగా సేవలందిస్తూనే అనేకమంది నిరుపేదల వివాహాలకు పుస్తెమట్టెల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఈ పురస్కారాన్ని ఈనెల 31న ఢిల్లీలో అందుకోనున్నారు. అవార్డుకు ఎంపికైన నేవూరి వెంకట్రెడ్డిని బుధవారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉన్నదని వెంకట్రెడ్డి తెలిపారు.