నర్సంపేట, సెప్టెంబర్ 30: వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయాలను ఏపీలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్తు అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ.. కేంద్రం విధించిన షరతులకు తలొగ్గి మోటర్లకు మీటర్లు పెట్టి రైతులను మోసం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధిలో దూసుకుపోతుంటే వైఎస్సార్సీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు.
మంత్రి హరీశ్రావుపై వైఎస్సార్సీపీ జనరల్ సెక్రెటరీ సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ఐటీ మంత్రి అమర్నాథ్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం 73 శాతం ఫిట్మెంట్ ఇస్తే, పక్క రాష్ట్రంలో 66 శాతానికి మించి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణకు వ్యతిరేకులుగా ఉన్న వారిని, విషం కక్కిన వారిని మాత్రమే వ్యతిరేకించామని చెప్పారు. మంత్రి హరీశ్రావు ఇతర రాష్ర్టాలపై, ప్రభుత్వ ఉద్యోగులపై ఎప్పుడూ తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తెలంగాణపై, టీఆర్ఎస్ నాయకులపై, మంత్రి హరీశ్రావుపై ప్రచారం కోసం ఏపీ నాయకులు వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు.