హైదరాబాద్ : నార్ముల్ ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్లు మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ప్రగతి భవన్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఇద్దరు మహిళా డైరెక్టర్లతో పాటు మంగళవారం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు డైరెక్టర్లను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో హరిత విప్లవంతో పాటు క్షీరవిప్లవం మొదలైందని తెలిపారు. మదర్ డెయిరీని లాభాల బాటలో నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇప్పటికే విజయ డెయిరీని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేవలం వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాల్లో ఉన్న అవకాశాలను సైతం అందిపుచ్చుకునేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు.
ముఖ్యంగా పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణా ఏర్పడిన రోజు నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు విజయ డెయిరీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నదని పేర్కొన్నారు. అటువంటి డెయిరీని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బలోపేతం చేశామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, రవీంద్ర కుమార్, ఫైళ్ల శేఖర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, నోములభగత్, నార్ముల్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు నార్ముల్కు కొత్తగా ఎన్నికైన డైరెక్టర్లు కర్నాటి జయశ్రీ, అలివేలు, కోట్ల జలంధర్ రెడ్డి, రచ్చా లక్ష్మి నరసింహారెడ్డి, గూడూరు శ్రీధర్ రెడ్డి, చల్లా సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.