‘ఫ్రీబీ కల్చర్, రేవ్డీ కల్చర్’ అంటూ పదేపదే గొంతుచించుకున్న మోదీ, అదే కల్చర్ను అవలంబిస్తున్నారు. అదానీ కొన్న ఎయిర్పోర్టుకు జీఎస్టీ లేదు కానీ.. పాలు, పెరుగు, చివరికి సామాన్యుడి మందులపైనా పన్నులు వేశారు. ఈ పిరమైన ప్రధానికి దేశ ప్రజలే తగ్గిన బుద్ధి చెప్తారు.
– మంత్రి కేటీఆర్
Minister KTR | రాజన్న సిరిసిల్ల, మే 2 (నమస్తే తెలంగాణ): ఉచితాలు దేశానికి మంచిది కాదంటూనే పాలు, పెరుగు, వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ ప్రకటించడంపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. వంటగ్యాస్పై పన్నుల భారం మోపుతూనే ఓట్లకోసం ఏదైనా ఇస్తామంటున్న నరేంద్రమోదీ దేశానికి ప్రధానా? లేక ఒక్క కర్ణాటక రాష్ట్రానికే ప్రధానా? అని నిలదీశారు. ఉచితంగా ఇస్తామంటున్న వంటగ్యాస్, పాలు ఇతర రాష్టాలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ‘ఫ్రీబీ కల్చర్, రేవ్డీ కల్చర్’ అంటూ పదేపదే గొంతుచించుకున్న మోదీ, అదే కల్చర్ను అవలంబిస్తున్నారని మండిపడ్డారు. అదానీ కొన్న ఎయిర్పోర్టుకు జీఎస్టీ లేదు కానీ.. పాలు, పెరుగు, చివరికి సామాన్యుడి మందులపైనా పన్నులు వేశారని ధ్వజమెత్తారు. ఈ పిరమైన ప్రధానికి దేశ ప్రజలే తగ్గిన బుద్ధి చెపుతారని స్పష్టం చేశారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అని పునరుద్ఘాటించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం డబ్బులు త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. గోపాల్పల్లి, వీర్నపల్లి మండలం గుంటపల్లి చెరువు తండా, సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరులో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం సిరిసిల్ల కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల ముగింపు సమావేశానికి హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మహిళల రక్షణకోసం ఏర్పాటు చేసిన మొబైల్ యాప్ను, హెల్ప్లైన్ నంబర్ను ప్రారంభించారు. హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో గ్రామాల్లో రోడ్ల పక్కన ఆరబోసిన ధాన్యం కుప్పలను పరిశీలించారు. రైతుల వెన్నుతట్టి ‘దిగులు పడకుండి.. అండగా నేనున్నా’ అంటూ ధైర్యం చెప్పారు.
రైతు బిడ్డ, రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండగా ఏ రైతుకూ నష్టం జరగదని మంత్రి కేటీఆర్ అన్నారు. పంటల నష్టం గురించి కేసీఆర్కు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని, అందరినీ ఆదుకుంటారని హామీ ఇచ్చారు. గత నెలలో కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించి, ఎకరాకు రూ.10 వేల పరిహారం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో ఇప్పటివరకు నష్టపోయిన పంటకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఏ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పారు. అంతపెద్ద సాయం ఈ రోజు రైతన్నలకు అందుతున్నదంటే రైతుబిడ్డ సీఎంగా ఉండటమే కారణమని తెలిపారు. కొన్నిచోట్ల 90 శాతంమేర ధాన్యం నేల రాలినట్టు సమాచారం ఉన్నదని పేర్కొన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకొంటామని హామీ ఇచ్చారు. రూ.65 వేల కోట్లతో 40 లక్షల మందికి రైతుబంధు ఇచ్చామని గుర్తుచేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో దుర్భిక్షం తాండవించిన ప్రాంతాలకు గోదావరి నీళ్లు తెచ్చిన సీఎం కేసీఆర్, తప్పకుండా రైతులందరికీ అండగా ఉంటారని, ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐదు దఫాలుగా కురిసిన అకాల వర్షాలతో ప్రాథమిక అంచనా ప్రకారం 17 వేల మంది రైతులకు చెందిన 19 వేల ఎకరాల పైచిలుకు పంటకు నష్టం జరిగినట్టు తెలిపారు. ఇంకా పంటలు కోస్తున్నందున నష్టం పెరగవచ్చని చెప్పారు. కేసీఆర్ పనితీరుపై విశ్వాసం, అవగాహన ఉన్నవారెవరైనా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా రైతు ప్రభుత్వమని చెప్తారని పేర్కొన్నారు. పార్టీ నిర్వహించిన ప్లీనరీలోనూ రైతు సమస్యలు, పెరిగిన జలవనరులు, వ్యవసాయం, రాష్ర్టాన్ని ప్రగతివైపు తీసుకెళ్లిన అంశంపైనే ఎక్కువసేపు చర్చ జరిగిందని తెలిపారు.
అకాల వర్షాలకు తడిసి, రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గత సంవత్సరం యాసంగిలో మే 1 నాటికి నాలుగు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈ సంవత్సరం అదే సమయానికి ఇప్పటికే 7 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు వివరించారు. కొనుగోళ్లలో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి రైతులకు ధైర్యం చెప్తున్నారని పేర్కొన్నారు. స్థలం ఉన్న పేదలకు త్వరలో గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఇండ్ల జాగలేని పేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఎస్టీపీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, రైతుబంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ తదితరులు ఉన్నారు.