నారాయణఖేడ్ అంటేనే రాళ్లు, రప్పలు, గుట్టలు.. మెట్ట ప్రాంతాలు.. కరువుకు కేరాఫ్.. వలసలకు నెలవు.. భూములను అమ్ముదామన్నా కొనే దిక్కులేని దుస్థితి.. ఉమ్మడి పాలకులెవరూ పట్టించుకోలేదు. కనీస వసతులు కానరాలేదు.. కానీ, స్వరాష్ట్ర పాలనలో నారాయణఖేడ్ అభివృద్ధిలో దౌడ్ అందుకున్నది. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు.. కాళేశ్వర జలాలతో సాగునీరు అందుతున్నది. ఇప్పుడు అక్కడ వలసలు లేవు.స్థానికంగానే చేతినిండా పనిదొరుకుతున్నది. తొమ్మిదేండ్లలో అన్నిరంగాల్లో అభివృద్ధి కండ్లముందు కనిపిస్తున్నది.
Narayankhed | సంగారెడ్డి, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలనలో కరువుతో అల్లాడిన నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దౌడు తీస్తున్నది. రూ.289 కోట్లకుపైగా వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారు. రూ.456 కోట్లతో పంచాయతీరాజ్శాఖ ద్వారా గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీహాళ్లు, రైతు వేదికలు, వైకుంఠధామాలు నిర్మించారు. రూ.110 కోట్లతో తండాలన్నింటికీ బీటీ రోడ్లు వేశారు. రూ.30 కోట్లతో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించారు. రూ.51 కోట్లతో 26 హైలెవల్ వంతెనలు నిర్మించారు. రూ.10 కోట్లతో 84 పంచాయతీల్లో భవనాలు. నారాయణఖేడ్లో రూ.50 కోట్లతో 1,100 డబుల్బెడ్రూం ఇండ్లు కట్టారు. రూ.25 కోట్లతో నారాయణఖేడ్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.26 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో సీసీ రోడ్లు, మురుగుకాల్వలు నిర్మించారు. రూ.50 కోట్లతో నారాయణఖేడ్లో మౌలిక వసతుల కల్పించారు. 17 సబ్స్టేషన్లను నిర్మించారు. రూ.4.60 కోట్లతో యూత్ సెంటర్ భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
బసవేశ్వర ఎత్తిపోతలతో నారాయణఖేడ్ సస్యశ్యామలం
కాళేశ్వరం, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలతో నారాయణఖేడ్ సస్యశ్యామలం కానున్నది. ఈ ఏడాది మార్చిలో మంత్రి హరీశ్రావు బోరంచలో బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారు. రూ.1,774 కోట్లతో నిర్మించే ఈ పథకం ద్వారా నియోజకవర్గంలోని 166 గ్రామాల్లో ఉన్న 1.31 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు 19, 19 ఏ ప్యాకేజీ పనులు రూ.800 కోట్లతో జరుగుతున్నాయి. కాళేశ్వరం కాల్వల ద్వారా నియోజకవర్గంలోని 30 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. నల్లవాగు ప్రాజెక్టును రూ.25 కోట్లతో ఆధునీకరించారు. మిషన్ కాకతీయ ద్వారా రూ.98 కోట్లతో 289 చెరువులను అభివృద్ధి చేశారు. రూ.5.28 కోట్లతో మూడు చెక్డ్యామ్లు నిర్మించారు.
నారాయణఖేడ్లో రూ.6 కోట్లతో వంద పడకల దవాఖానగా మార్చారు. రూ.11 కోట్లతో 50 పడకల మాతాశిశు దవాఖానను, రూ.1.10 కోట్లతో డయాలసిస్ సెంటర్ను, రూ.2.5 కోట్లతో మినీ టీ డయాగ్నస్టిక్ హబ్ను, రూ.1.03 కోట్లతో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. కరస్గుత్తి, కల్హేర్లో రూ.11 కోట్లతో 30 పడకల దవాఖానలను ప్రభుత్వం నిర్మించింది. రూ.3.12 కోట్లతో నిజాంపేట, సిర్గాపూర్లో పీహెచ్సీలను ఏర్పాటు చేసింది. ఎనిమిది గురుకులాలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేశారు. రూ.22 కోట్లతో నారాయణఖేడ్లో నాలుగు గిరిజన గురుకుల భవనాలను నిర్మించారు. మన ఊరు-మనబడి కింద రూ.34 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారు. నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్గా, కొత్తగా సిర్గాపూర్, నాగల్గిద్ద, నిజాంపేట, తడ్కల్ మండలాలను ఏర్పాటుచేసి పాలనను ప్రజలకు మరింత చేరువ చేశారు. వంద తండాలను పంచాయతీలుగా మార్చారు.