Nara Bhuvaneshwari | హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): టీడీపీ కంచుకోట కుప్పం వేదికగా చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. కుప్పం నుంచి పోటీ చేయకుండా చంద్రబాబుకు రెస్ట్ ఇద్దామంటూ ఆయన సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. 35 ఏండ్లుగా కుప్పం నుంచి బాబు పోటీ చేస్తున్నారని, ఈసారి అక్కడి నుంచి తానే బరిలో నిలవాలనుకుంటున్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది.
‘న్యాయం గెలవాలి’ యాత్రలో భాగంగా బుధవారం కుప్పం లో ప్రజలను ఉద్దేశించి భువనేశ్వరి ప్రసంగిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ప్రసంగం చివర్లో మాత్రం ఆ వ్యాఖ్యలు సరదాగా చేసినవేనని, తనకు పోటీచేసే ఉద్దేశమే లేదని చెప్పడంతో ఊహాగానాలకు ఫుల్స్టాప్ పడింది. భువనేశ్వరి వ్యాఖ్యలను మాత్రం వైసీపీ సీరియస్గానే తీసుకుంది. బాబులో భయం మొదలైందని, ఆమె వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.