హైదరాబాద్, జనవరి 24 : యూరియా బస్తా 50 కిలోల బరువు ఉంటుంది. దాన్ని మోయాలంటే ఆపసోపాలు పడాలి, దాని రేటు కూడా వేలకు వేలు. ఆ బస్తా చేసే పనితీరును అర్ధ లీటర్ బాటిల్ యూరియా చేస్తే! రైతులకు మోతకోలు తప్పుతుంది. నానో యూరియా పేరుతో ప్రముఖ ఎరువుల తయారీ కంపెనీ ఇఫ్కో దీన్ని తయారుచేసింది. గుళికల రూపంలో ఉండే 50 కిలోల బస్తాతో సమానంగా ఈ అర్ధ లీటర్ నానో యూరియా పని చేస్తుంది. చిన్న డబ్బాలో పట్టుకెళ్లి పంటపై స్ప్రే చేస్తే సరిపోతుంది. గుళికల యూరియాతో పోల్చితే నానో యూరియాతో బహుళ ప్రయోజనాలున్నాయి. నానో యూరియాతో రవాణా ఇబ్బందులు తప్పడంతో పాటు పెట్టుబడి ఖర్చు తగ్గి, పంట ఉత్పత్తి కూడా పెరుగుతుందని ప్రయోగాల్లో తేలింది. అందువల్ల బస్తా యూరియాకు బదులు నానో యూరియాను వినియోగించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఈ నానో యూరియా బాటిల్స్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రాల్లో, ఇతర ఎరువుల షాపుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
రైతుకు రూ.70 వరకు ఆదా
50 కిలోల యూరియా బస్తా ఉత్పాదక ఖర్చు .. రూ.3,500. ప్రభుత్వం సబ్సిడీ కింద రైతులకు రూ.266కే అందిస్తున్నది. అదే.. నానో యూరియా 500 మిల్లీ లీటర్ల బాటిల్ ధర రూ.240 మాత్రమే. అంటే రైతుకు రూ.26 తగ్గుతుంది. ప్రభుత్వానికి కూడా సబ్సిడీ భారం తప్పుతుంది. యూరియా బస్తాను ఎరువుల షాప్ నుంచి ఇంటికి తీసుకెళ్లాలంటే రైతుకు కనీసం రూ.50 రవాణా ఖర్చు అవుతుంది. నానో యూరియాతో రవాణా ఖర్చే ఉండదు. చేతిలో పట్టుకొని పోవచ్చు. అంటే.. రైతుకు నానో యూరియాతో రూ.70 వరకు ఆదా అవుతుంది. అంతేకాదు.. గుళికల యూరియాతో పోల్చితే నానో యూరియా వాడకంతో పంట దిగుబడి 8 శాతం పెరుగుతుందని ప్రయోగాల్లో వెల్లడైంది.
అన్ని ఆగ్రోస్ కేంద్రాల్లో లభ్యం
నానో యూరియా అన్ని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రాల్లో అందుబాటులో ఉన్నది. బస్తా యూరియాతో పోల్చితే నానో యూరియాతో అనేక ప్రయోజనాలున్నాయి. రైతులు నానో యూరియా వైపు మళ్లాలి. తద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గటంతో పాటు పంట దిగుబడి పెరుగుతుంది. వాతావరణానికీ హాని ఉండదు.