Nandini | హైదరాబాద్, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ): డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క భార్య నందిని ఖమ్మం లోక్సభ స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె బలప్రదర్శనకు దిగారు. ఖమ్మం నుంచి ఏకంగా 700 కార్లతో భారీ ర్యాలీగా హైదరాబాద్లోని గాంధీభవన్కు చేరుకున్నారు. ఆమె ‘బల’ ప్రదర్శన పార్టీలో చర్చనీయాంశంగా మారిం ది. దరఖాస్తు సమర్పణ అనంతరం నందిని మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం నుంచి పోటీచేయాలని సోనియాగాంధీ, ప్రియాంకను కోరామని, వారు పోటీచేస్తే అందరం కలిసి గెలిపించుకుంటామని, లేకుంటే ఆ స్థానాన్ని తనకు కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరినట్టు చెప్పారు. తుది నిర్ణయం మాత్రం అధిష్ఠానానిదేనని స్పష్టం చేశారు.
దరఖాస్తుల ప్రక్రియ శనివారంతో ముగియగా 17 స్థానాలకు మొత్తంగా 306 దరఖాస్తులు వచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. వీటిలో ఖమ్మం, నల్లగొండ, మల్కాజిగిరి స్థానాలకు భారీ పోటీ నెలకొన్నది. పలువురు సీనియర్ నేతలతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. నందినితోపాటు రేణుకాచౌదరి, వీహెచ్, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్రెడ్డి, మరోమంత్రి తుమ్మల కుమారుడు యుగేందర్ ఖమ్మం టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు, వీవీసీ గ్రూప్స్ అధినేత రాజేంద్రప్రసాద్ కూడా అదే స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ సీనియర్ నేత కుసుమకుమార్ కూడా అదే స్థానాన్ని ఆశిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ టికెట్ కోసం జానారెడ్డి తనయుడు రఘువీర్రెడ్డి, పటేల్ రమేశ్రెడ్డితోపాటు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కుమార్తె శ్రీనిధిరెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. భువనగిరి టికెట్ కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి భార్య లక్ష్మి టికెట్ ఆశిస్తుండగా, వెంకట్రెడ్డి సోదరుడు మోహన్రెడ్డి కుమారుడు డాక్టర్ సూర్యపవన్రెడ్డి, మరో బంధువు మురళీధర్రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. సీఎం సన్నిహితుడు చామల కిరణ్కుమార్రెడ్డి కూడా రేసులో ఉన్నారు.