హైదరాబాద్ : ఫుడింగ్ పబ్ కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో నాలుగు రోజుల పాటు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. పుడింగ్ పబ్ యజమాని, మేనేజర్ అభిషేక్, అనిల్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కోర్టు అనుమతి నేపథ్యంలో అనిల్ ఇద్దరిని బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నించనున్నారు.
పుడింగ్ పబ్లో కొకైన్ లభించడంతో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఇద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ను విధించింది. ఆ తర్వాత వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న కోర్టు ఇవాళ నాలుగు రోజులు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. పబ్లోకి ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి ? డ్రగ్స్ను ఎవరెవరికి సరఫరా చేశారనే వివరాలను పోలీసులు తెలుసుకోనున్నారు.