హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వ దవాఖానలను మరింత బలోపేతం చేసేందుకు వైద్యారోగ్యశాఖ నూతన విధానాన్ని ప్రకటించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించేందుకు స్థలం ఇచ్చినా లేదా భవన నిర్మాణానికి నిధులు ఇచ్చినా ఆ భవనానికి దాత సూచించిన పేరును పెట్టనున్నట్టు తెలిపింది.
ఇప్పటికే పీహెచ్సీ కొనసాగుతున్న లేదా నూతన దవాఖాన ఏర్పాటుకు అనుమతులు పొందిన ప్రాంతాల్లో మాత్రమే దాతల విరాళాలను స్వీకరించనున్నట్టు స్పష్టం చేసింది. ‘స్థలం ఇస్తాం పీహెచ్సీని మంజూరు చేయండి’ వంటి విజ్ఞప్తులను స్వీకరించబోమని స్పష్టంచేసింది. ఇప్పటికే ఎక్కడైనా దాతల సహకారంతో పీహెచ్సీ నిర్మాణం జరిగి ఉంటే ప్రభుత్వ అనుమతితో దానికి పేర్లు పెడతామని తెలిపింది. ఈ మేరకు తాజాగా వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు.