Minister KTR | బీఆర్ఎస్ పార్టీ పేరే మారిందని, డీఎన్ఏ మారలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట బీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఎంపీగా బండి సంజయ్, ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఎంపీగా నాలుగున్నరేళ్లలో బండి సంజయ్, 14నెలల్లో ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ఏం చేశారో దమ్ముంటే చెప్పాలి. తెల్లారిలేస్తే చిల్లర మాటలు మాట్లాడడం కాదు. చేతనైన మాకంటే రెండు మంచి పనులు ఎక్కువ చేసి మనసు గెలుచుకో. హుజూరాబాద్కు ఓ మెడికల్ కాలేజీ తీసుకురా.. సన్మానం చేస్తాం. చేతనైతే నవోదయ, ట్రిపుల్ ఐటీ తీసుకురా.. ఇవేవి చేతకాదు. తెల్లవారి లేస్తే మతం పేరిట చిచ్చుపెట్టుట్ల సిద్ధహస్తులు’ అంటూ ధ్వజమెత్తారు.
‘మన తెలంగాణ పార్టీ అంటే.. భారత్ రాష్ట్ర సమితి తప్పా.. గుజరాత్ పార్టీలు కాదు. గుజరాత్ వాళ్లకు గులామ్ చేసుడు బండి సంజయ్కి షోకుగా ఉండవచ్చు. వాళ్లకు గులామ్గిరి చేయాల్సిన అవసరం రేషంగల్ల కరీంనగర్ బిడ్డలకు లేదు. వాళ్లకు చేతకాదు. బీఆర్ఎస్ పార్టీ పేరు మారింది. మహారాష్ట్ర, కర్నాటకలో గులాబీ జెండా, నేత దమ్మును చూపించాల్సింది అవసరం ఉంది. అందుకే పేరు మారింది. పేరు మారింది కానీ డీఎన్ఏ మారలేదు. పేరు మారింది కానీ నాయకుడు మారలేదు. పేరు మారింది కానీ జెండా, ఎజెండా మారలే. తెలంగాణ విషయంలో దేవుడితో కొట్లాడెదే మన ఎజెండా’ అని స్పష్టం చేశారు.
‘కేసీఆర్ పాలన అరిష్టం అంటున్నరు. నేను అడుగుతున్న ఎవరి పాలన అరిష్టం. రైతుబంధు కింద 65లక్షల మంది రైతులకు రూ.65వేలకోట్లు వారి ఖాతాల్లో వేసిన కేసీఆర్ పాలన అరిష్టమా?.. 700 మంది రైతులను సంపిన మోదీ పాలన అరిష్టమా? హుజూరాబాద్ రైతులు ఆలోచన చేయాలి. కేసీఆర్ కిట్, ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం చేసిన కేసీఆర్ పాలన అరిష్టమా ఆలోచన చేయాలి. జిల్లాకో మెడికల్ కాలేజీ పెడుతున్న కేసీఆర్ పాలన అరిష్టమా? రాష్ట్రానికి ఇప్పటి వరకు ఒక్క విద్యాసంస్థ ఇవ్వని మోదీ దిక్కుమాలిన పాలన అరిష్టమా? రూ.700 పింఛన్ ఇచ్చే గుజరాత్ పాలన కావాలా? రూ.2వేల పెన్షన్ ఇచ్చే తెలంగాణ ప్రభుత్వం పాలన కావాలా? మళ్లీ వస్తరు ఆగమ్ కావద్దు.
సాదుకుంటరో సంపుకుంటరో.. బీదమొఖం పెట్టుడు.. ఏడిసినట్టు చేసుడు.. గులుగుడు మళ్లీ చేస్తే వాటికి పడిపోవద్దు. గందరగోళమైపోతరు, ఆగమైతరు. హుజూరాబాద్లో మొన్న జరిగిన పొరపాటు.. భవిష్యత్లో మళ్లీ జరుగద్దు. మళ్లీ హుజూరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగిరేవిధంగా ఒక కసితో కౌశిక్రెడ్డి నేతృత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం. స్టేడియాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తాం. హుజూరాబాద్లో ఇంకా చాలా పని ఉన్నది. హుజూరాబాద్లో అవకాశం ఇస్తే అన్నీ పూర్తి చేస్తాం’ అని కేటీఆర్ అన్నారు.