హైదరాబాద్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ): అసాధ్యం అనుకున్న తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కలను సుసాధ్యం చేసిన సీఎం కేసీఆర్ను తెలంగాణ రాష్ర్టానికి శాశ్వత సీఎంగా చెయ్యాల్సిన అవసరం ఉన్నదని, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ఆ విజ్ఞత ప్రదర్శించాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తన రాజకీయ చతురత, ఆత్మవిశ్వాసంతో 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో సాధించిన రాష్ర్టాన్ని తన మార్క్ సంక్షేమ పథకాలతో సుభిక్షంగా మార్చారని చెప్పారు. నాటి ఆయన ఆలోచనలు, తపనే.. నేటి ఆకుపచ్చని తెలంగాణ అని అన్నారు. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్తో ప్రయాణం తనకు దక్కిన అదృష్టమని చెప్పారు. సీఎం కేసీఆర్తో తన ఆలోచనలు కలవడమే తమ సుదీర్ఘ ప్రయాణం వెనుకగల రహస్యమని తెలిపారు. ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నాటి ఉద్యమ జ్ఞాపకాలను, తెలంగాణ కోసం కేసీఆర్ పడ్డ కష్టాలను జగదీశ్రెడ్డి పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..
కేఎల్ రావులా.. కేసీఆర్ను ఏకగ్రీవం చేయాలి
ఇంజినీర్ కేఎల్ రావు తెలంగాణకే పరిమితం కావాల్సిన నాగార్జునసాగర్ ఎడమ కాల్వను డిజైన్లో మార్పులు చేసి కృష్ణాకు నీళ్లు వెళ్లేలా చేశారు. దీనికి కృతజ్ఞతగా నాడు అక్కడి ప్రజలు, పార్టీలు ఆ ప్రాంతం నుంచి కేఎల్ రావును ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తద్వారా ఆయన కేంద్ర మంత్రి కూడా అయ్యారు. అంత చిన్న పనిచేసిన కేఎల్ రావుకు అక్కడి ప్రజలు, పార్టీలు అంత కృతజ్ఞత చూపితే.. అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించిన కేసీఆర్కు ఇక్కడి ప్రజలు, పార్టీలు ఇంకెంత చేయాలి. కేసీఆర్ను తెలంగాణకు శాశ్వత సీఎంను చెయ్యాలి. ఇందుకోసం అన్ని పార్టీలు ఆ విజ్ఞత ప్రదర్శించాలి.
ఆ ఆత్మవిశ్వాసం అచంచలం
తెలంగాణ కోసం 14 ఏండ్లపాటు జరిగిన ఉద్యమంలో అనేక ఆటుపోట్లు ఎదురైనా కేసీఆర్ ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కొందరు పార్టీని వీడుతున్నా, అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేస్తున్నా అడుగు వెనక్కి వేయలేదు. ‘మనం బతికితే తెలంగాణ కోసం బతకాలి.. చస్తే తెలంగాణ కోసమే చావాలి. అంతేగానీ ఉద్యమాన్ని వీడే ప్రసక్తే లేదు. మన అంతిమ లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ ప్రజలకు విముక్తి’ అంటూ మాలోనూ స్ఫూర్తి నింపేవారు.
అది నా అదృష్టం
కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తుల్లో నేను ఒకడిని. ఆయనతో కలిసి అటు ఉద్యమంలో, ఇటు ప్రభుత్వంలో పనిచేయడం నిజంగా నా అదృష్టమే. ఉద్యమం, పార్టీ ప్రారంభానికి ముందు కేసీఆర్ పలుమార్లు లాయర్లతో సమావేశం ఏర్పాటుచేస్తే నేను కూడా వెళ్లాను. అలా నా ప్రయాణం మొదలైంది. నా ఆలోచనలు కేసీఆర్ ఆలోచనలకు చాలా దగ్గరగా ఉండేవి. ఆయన చెప్పిన అంశాలను తు.చ. తప్పకుండా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం, పక్కాగా అమలు చేయడంతో నాపై విశ్వాసం పెరిగింది. పార్టీ మండల అధ్యక్షుడిని అవుదామనుకున్న నన్ను పిలిచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే నా జీవితం.. కేసీఆర్ పరిచయానికి ముందు, తర్వాత అని చెప్పుకోవాలి.
నేటి తెలంగాణకు.. ఏనాడో బీజం
ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఇప్పటికప్పుడు ఆలోచనల నుంచి పుట్టినవి కావు. ఈ పథకాలకు తెలంగాణ ఉద్యమం ప్రారంభంలోనే బీజం పడింది. తెలంగాణ వస్తుందని గట్టిగా నమ్మిన కేసీఆర్.. రాష్ర్టాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేదానిపై ఆనాడే ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రం సిద్ధించాక నాటి ఆలోచన పథకాల అమలుతోపాటు మరెన్నో తీసుకొచ్చారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని విధంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని అనేక పథకాలు ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్రజల బాగు కోసం ప్రవేశపెట్టిన పథకాలు కాబట్టే ఓట్ల గురించి ఆలోచించలేదు. దళితబంధు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి ఇలా అనేక పథకాలు ఆ కోవకు చెందినవే.
ఆయన ప్రజలకు మాత్రమే అర్థమవుతరు…
సీఎం కేసీఆర్ అర్థంకారు.. ఆయన ఆలోచనలు కూడా అర్థం కావు అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. అవును నిజమే ఆయన ప్రజలకు మాత్రమే అర్థమవుతరు. ప్రజలకు ఏం కావాలో ఆయనకు తెలుసు.. ఆయన చిత్తశుద్ధి గురించి ప్రజలకు తెలుసు. సీఎం కేసీఆర్ లాంటి మేధావులు ఒక జనరేషన్ ముందుగా ఆలోచిస్తారు. అర్థం చేసుకోగలిగితే ఆయన మౌనానికి కూడా అర్థం ఉంటుంది. ఒక్కోసారి
5-6 గంటల పాటు మౌనంగా గడిపిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఆ రోజు ఏడ్చేశాను
ఉద్యమంలో భాగంగా అన్ని జిల్లాలు తిరిగి క్షేత్రస్థాయిలోని ఇబ్బందులు తెలుసుకొని కేసీఆర్కు వివరించే వాళ్లం. ఓ సందర్భంలో మహబూబ్నగర్ వెళ్లినప్పుడు అక్కడ మధ్యవయస్సు మగవాళ్లు ఎవరూ కనిపించలేదు. ఏంటని అడిగితే బతకపోయినారు అని చెప్పారు. పెండ్లికో, చావు కో కలుస్తమన్నారు. నాడు సీఎం కేసీఆర్ వద్దకు వచ్చి ఏడ్చేశాను. నాతోపాటు ఆయన కూడా చాలా బాధపడ్డారు. పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది కాబట్టే మనం ఉద్యమం మొదలు పెట్టామని అన్నారు. ఈ కష్టాలు పోవాలంటే తెలంగాణ రాష్ట్రం ఒక్కటే మార్గమని చెప్పారు.
పదవులు, ఆస్తులపై కేసీఆర్ ఆశపడలేదు
పదవులు, ఆస్తులపై ఆయన ఏనాడూ దృష్టి పెట్టలేదు. ఆయన ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్రం. ఉద్యమానికి ముందే తెలంగాణపై ఆయనకు పూర్తి స్పష్టత ఉంది. నీళ్లు లేక, కరెంటు లేక తెలంగాణ ఇబ్బంది పడుతున్నదని ఆవేదన చెందేవారు. హైదరాబాద్ ఉండటం వల్ల తెలంగాణ ప్రాంతం నుంచే అధిక ఆదాయం వస్తున్నది.. కానీ ఆ ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు చేస్తున్నారనేవారు. రాష్ట్రం సాధించుకుంటే అద్భుతంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దుకోవచ్చని పార్టీ స్థాపించాలనే ఆలోచన వచ్చిన తొలి నాళ్లలోనే కేసీఆర్ అనుకున్నారు. ఆ ఆలోచనను ఇప్పుడు అమల్లో పెడుతున్నారు.