నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆటో షో (Auto Show) ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ హాజరయ్యారు. ఎస్బీఐ డీజీఎం బిజయ్ కుమార్ సాహూ, యూబీఐ ఏజీఎం ప్రవీణ్ వేణుగోపాలన్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. నిజామాబాద్లో నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో 4వ ఎడిషన్ ఆటో షో మొదలవడం పట్ల అతిథులు హర్షం వ్యక్తం చేశారు. నగరవాసుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ ఆటో షో దిగ్విజయం కావాలని వారంతా ఆకాంక్షించారు. మొత్తం 17 స్టాళ్లను ఏర్పాటు చేశారు.
ఔత్సాహిక కొనుగోలుదారులందరికీ అన్ని రకాల వాహనాలను ఒకే వేదికపై అందించాలన్న ఉద్దేశంతో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ గత మూడేండ్లుగా దిగ్విజయవంతంగా ఆటో షోను నిర్వహిస్తున్నది. ప్రజల స్పందనను స్ఫూర్తిగా తీసుకుని మరోసారి వాహన ప్రదర్శనకు ఏర్పాట్లు చేసింది. శని, ఆదివారాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తున్న ఈ ఆటో షోకు వచ్చే సందర్శకులకు ప్రవేశం ఉచితం. కాలానుగుణంగా వస్తున్న మార్పులతో పాటు వాహనదారుల అభిరుచికి అనుగుణంగా మార్కెట్లోకి వస్తున్న అధునాతన వాహనాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచనున్నారు. అలాగే, వాహనాల కొనుగోలుకు అవసరమైన లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా ఇక్కడ కొలువుదీరనున్నాయి. కియా, మారుతి, నిస్సాన్, హ్యుండాయ్, నెక్సా, టాటా, రాయల్ ఎన్ఫీల్డ్, హీరో, హోండా, టీవీఎస్, ఏథార్, చేతక్ తదితర కంపెనీలు షోలో పాల్గొంటున్నాయి. యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా సందర్శకుల కోసం ఇక్కడ స్టాళ్లు ఏర్పాటు చేశాయి.