రఘునాథపాలెం, ఫిబ్రవరి 3: వాహన ప్రేమికుల కోసం ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఆటో ఎక్స్పో ఏర్పాటైంది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనను ఖమ్మం జిల్లా పరిషత్ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా రవాణాశాఖ అధికారి మహ్మద్ గౌస్, నమస్తే తెలంగాణ అడ్వైర్టెజ్మెంట్ జీఎం ఎన్ సురేందర్రావు శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాహన కొనుగోలుదారుల సౌలభ్యం కోసం వివిధ ఆటోమొబైల్ కంపెనీలను, బ్యాంకర్లను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. సామాన్యుల నుంచి కోటీశ్వరుల వరకు అందరినీ ఆకట్టుకునేలా ఈ ఎక్స్పోలో వివిధ కంపెనీల కార్లు, బైక్లు కొలువుదీరాయి. దీంతో తొలి రోజే ఈ ప్రదర్శన కిటకిటలాడింది.
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు ఆయా స్టాళ్ల వద్దకు వెళ్లి వాహనాల వివరాలు, రుణ సదుపాయాల గురించి తెలుసుకున్నారు. కొందరు సందర్శకులు అక్కడికక్కడే వాహనాలను బుక్ చేసుకున్నారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా రవాణాశాఖ ప్రాంతీయ కార్యాలయ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్, నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ రమేశ్, బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణు, అడ్వైర్టెజ్మెంట్ మేనేజర్ బోయిన శేఖర్బాబు, సర్క్యులేషన్ మేనేజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ప్రయోజనార్థమే..
ప్రజల ప్రయోజనార్థమే ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ప్రాపర్టీ షో, ఆటో షోలు నిర్వహిస్తున్నాయి.. గతంలో ఇలాంటి షోలు ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహా నగరాలకే పరిమితమయ్యేవి. అన్ని జిల్లాల్లో ఆటో షోలు నిర్వహించి వాహనప్రియుల కలను సాకారం చేస్తున్నాం. ఇక ముందు కూడా మరిన్ని షోలు నిర్వహిస్తాం. అన్ని రకాల వాహనాలు ఓకే వేదిక మీదకి తీసుకొని రావడం వల్ల కొనుగోలు దారులు అన్ని బేరీజు వేసుకొని నిర్ణయాన్ని తీసుకోవాడానికి అనువైన అవకాశాల్ని కలిపిస్తున్నాం, అలాగే అదే వేదిక పై బ్యాంకులని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాము.
– ఎన్ సురేందర్ రావు, నమస్తే తెలంగాణ అడ్వైర్టెజ్మెంట్ జనరల్ మేనేజర్