ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకత, విప్లవాత్మక సంస్కరణలు, మెరుగైన మౌలిక వసతులు, వ్యాపార సానుకూలతలతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు హైదరాబాద్లో 10-15 అంతస్థుల భవనాలను నిర్మించడమే గగనంగా ఉండేది. అంత కంటే ఎకువ అంతస్థులతో భవనాలను నిర్మించగలమని ఇకడి బిల్డర్లు కలలో కూడా అనుకోలేదు. కానీ, గత తొమ్మిదిన్నర ఏండ్లలో పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. ఫలితంగా దేశంలో అత్యధిక ఆకాశహర్మ్యాలను కలిగిన నగరంగా హైదరాబాద్ ఆవిర్భవించింది. 65 అంతస్థుల భవనాన్ని కలిగిన రెండో నగరంగా నిలిచింది. ఎకరం భూమిని ఏకంగా రూ.100 కోట్లకు అమ్మే స్థాయికి ఎదిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలతోనే ఇది సాధ్యమైంది. సీఎం కేసీఆర్ దార్శనికత, మంత్రి కేటీఆర్ చొరవ రియల్ ఎస్టేట్ రంగానికి ఎనలేని భరోసా ఇచ్చిందని, దీంతో అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలకు హైదరాబాద్ వేదికగా నిలిచిందని హైదరాబాద్ క్రెడాయ్ శాఖ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ రియల్ రంగంలో గత 9 ఏండ్ల నుంచి వచ్చిన మార్పులు, భవిష్యత్తుపై ఆయన తన అభిప్రాయాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
– హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ
సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే..
తెలంగాణ ఏర్పాటయ్యాక స్వరాష్ట్రంలో క్రెడాయ్ హైదరాబాద్ నిర్వహించిన తొలి ప్రాపర్టీషోకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఉన్న సామర్థ్యాన్ని, అవకాశాలను గుర్తించారు. తదనుగుణంగా నూతన పాలసీల రూపకల్పనకు ప్రాధాన్యమిచ్చారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక వసతులు, మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి సారించారు. అందులో భాగంగా ఓఆర్ఆర్ నిర్మాణాన్ని పూర్తి చేయడం, నగర విస్తరణకు అనుగుణంగా రోడ్డు రవాణా సదుపాయాలను కల్పించడంతో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకున్నది. తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.50 వేల కోట్ల నుంచి రూ.2.5 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. ఐటీతోపాటు ఇతర అన్ని రంగాలకూ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. జీనోమ్ వ్యాలీని ఆధునీకరించడంతోపాటు హైదరాబాద్ చుట్టూ పలు పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసింది. అందుకే ఇప్పుడు రియల్ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నది.
అన్ని రంగాల్లోనూ ఆదర్శం
దేశానికి అన్ని రంగాల్లోనూ తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది. లక్షల మందికి ఉపాధి కల్పించే స్థాయికి హైదరాబాద్ ఎదగడంతో నగరానికి వలసలు నానాటికీ పెరుగుతున్నాయి. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం.. పల్లెల్లో రోడ్లు, తాగునీటి వసతులు, విద్యుత్తు సరఫరా, తదితర మౌలిక వసతులను మెరుగుపర్చడంతో గ్రామాల్లోనూ భూముల ధరలు పెరిగాయి. ఈ అంశాలన్నీ తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో ఊతమిచ్చాయి.
సంక్షోభ సమయంలోనూ నిలిచినం
గతంలో రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభం తలెత్తితే ప్రభుత్వాలు చేతులెత్తేసేవి. కానీ, తెలంగాణ ఏర్పాటు తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే కరోనా సంక్షోభ సమయంలోనూ ఈ రంగం చెక్కుచెదరలేదు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ కుదేలైనప్పటికీ హైదరాబాద్లో స్థిరాస్తి క్రయవిక్రయాలు, ఇండ్ల నిర్మాణాలు జోరుగా జరిగాయి. కరోనా సంక్షోభ ప్రభావం రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంపై పడకుండా నివారించేందుకు అనుమతుల ఫీజులను వాయిదాల పద్ధతిలో చెల్లించేలా ప్రభుత్వం అవకాశం కల్పించడంతో బిల్డర్లపై భారం తగ్గింది. దీంతో కొత్త ప్రాజెక్టులను సులభంగా చేపట్టగలిగారు.
రియల్ పెట్టుబడులతో అధిక రాబడి
హైదరాబాద్లో విలాసవంతమైన భవనాల కొనుగోళ్లు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇకడ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయనడానికి ఇదే నిదర్శనం. గతంలో ఇక్కడ కేవలం సంపన్న వర్గాలవారు మాత్రమే విలాసవంతమైన భవనాలను కొనుగోలు చేసేవారు. కానీ, ఇప్పుడు ఎన్నారైలతోపాటు ఎగువ మధ్యతరగతి ప్రజల్లో చాలా మంది గేటెడ్ కమ్యూనిటీల్లో విలాసవంతమైన ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు అధిక రాబడి కోసం తమ సంపాదనలో దాదాపు 50% మేరకు వెచ్చించి భూములు కొంటున్నారు. హైదరాబాద్తోపాటు తెలంగాణ వ్యాప్తంగా స్థిరాస్తి ధరలు నానాటికీ పెరుగుతుండటమే ఇందుకు కారణం.
బెంగళూరు కంటే హైదరాబాద్ బెటర్
గతంలో ఐటీ, వాణిజ్యపరంగా హైదరాబాద్ కంటే బెంగళూరు ఎంతో ముందంజలో ఉండేది. అదే ఇప్పుడు ఆ నగరానికి శాపంగా మారింది. గాడి తప్పిన ప్రణాళికలు, ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలతో అకడ మారెట్ ప్రతికూలంగా మారింది. దీంతో ఇప్పుడు బెంగళూరు కంటే హైదరాబాద్ ఎంతో ఉత్తమం అన్న భావన సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఐటీ, పారిశ్రామికం సహా అనేక రంగాల్లో జోరుగా ముందుకు సాగుతున్న హైదరాబాద్లో పుష్కలమైన ల్యాండ్ బ్యాంక్ ఉండటం, నగరం చుట్టూ రవాణా సదుపాయాలు మెరుగుపడటంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో మరో 100 ఏండ్ల వరకూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ఢోకా ఉండదు.