పెద్దపల్లి, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వంతోనైనా పోరాడి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రజా సమస్యలు పరిష్కరిస్తా. పార్లమెంట్లో ప్రజల గొంతుకనవుతా. 30 ఏండ్ల సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి ఆరోపణ, మచ్చలేని నాయకుడిగా ఎదిగా. ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్లంతా ఎన్నికల ముందు వచ్చి, ఎన్నికల తరువాత కనిపించకుండా వెళ్లిపోయే వారే. పార్లమెంట్ పరిధిలోని ప్రతి కుటుంబంతో నాకు ఆత్మీయ అనుబంధం ఉంది’ అని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ..
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అంటే కార్మిక, కర్షక క్షేత్రం. నేను ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ప్రజల మధ్యే సింగరేణి కార్మిక నేతగా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చా. ఓ కార్మిక బిడ్డగా నన్ను ప్రతి చోట గొప్పగా ఆదరిస్తున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా, మంత్రిగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ప్రజలకు సేవ చేశా. 30 ఏండ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా, దళిత వర్గాల నుంచి ఎదిగిన బిడ్డగా ఉన్న నాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవకాశం ఇచ్చారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి పోటీ చేస్తున్న నాయకులకు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఎలాంటి సంబంధాలు లేవు. కార్మికులు, కర్షకుల కష్టాలపై వాళ్లకు అవగాహన లేదు. వనరులు, అభివృద్ధి, సంక్షేమంపై కనీసం సమాచారం కూడాలేదు. కార్పొరేట్ లైఫ్ ైస్టెల్లో ఉండే వీరంతా ఏసీ రూంల్లో ఉండి వ్యాపారాలు చూసుకునే వారు. కేవలం డబ్బు సంచులతో మాత్రమే పెద్దపల్లి పార్లమెం
ట్లో రాజకీయం చేస్తూ ఓట్లను దండుకోవాలని చూస్తున్నారు.
ఢిల్లీ స్థాయిలో పరిషరించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయి. సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు, పెన్షన్ విధానం, పెద్దపల్లి రైల్వే జంక్షన్లో అన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ల నిలుపుదల, పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి హన్మకొండ దాకా జాతీయ రహదారి నిర్మాణం, జగిత్యాల-ధర్మారం, పెద్దపల్లి-మంథని, మంథని-కాళేశ్వరం రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించడం, పెద్దపల్లి జిల్లాలో నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు, సుల్తానాబాద్లో రైల్వే డ్రై పోర్టు నిర్మాణం, బసంత్నగర్ విమానాశ్రయ పునరుద్ధరణ, రామగిరిఖిల్లా అభివృద్ధి, రూప్వే నిర్మాణం, రామగుండం, మణుగూరు వయా మంథని మీదుగా నూతన రైల్వే మార్గం, పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వయా కరీంనగర్ సింగిల్ రైల్వే మార్గాన్ని డబుల్ రైల్వే మార్గంగా విస్తరించడం, ప్రముఖ ఆలయాలు ధర్మపురి, కాళేశ్వరం, ఓదెలలోని ఆలయాలను ప్రసాద్ ప థకంలో చేర్చడం, సింగరేణి కార్మికుల సొం తింటి కల, క్వార్టర్లను సొంతం చేయడం, కాం ట్రాక్టు, డిపెండెంట్ కార్మికులకు చదువుకు తగ్గట్టుగా ఉద్యోగాలు. నేను ఎంపీగా గెలిచిన వెంట నే ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా.
కాంగ్రెస్ పార్టీలోని వివేక్ కుటుంబం మొన్నటిదాక కేసీఆర్ను కుటుంబ పాలన అన్నారు. ఒక పార్లమెంట్ పరిధిలోని నాలుగు అవకాశాలు ఉంటే అందులో మూడు ఒకే ఇంట్లో ఇచ్చారు. అంబేద్కర్ చెప్పినట్టు రిజర్వేషన్ అనేది ఒక ఎదుగుదల తర్వాత తప్పకుండా మిగతా వారికి అవకాశం ఇవ్వాలి. దేశంలోనే శ్రీమంతుల జాబితాలో 9వ నెంబర్గా ఉన్న వాళ్లు రిజర్వేషన్ల కోటాలోనే పోటీ ఎందుకు ? రాజకీయాలపై ఆసక్తి ఉంటే ఎక్కడైనా జనరల్ స్థానాల్లో పోటీ చేయవచ్చు. మాదిగ సామాజిక వర్గం వాళ్లు ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ టికెట్ కావాలని కోరినా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ సామాజిక న్యాయాన్ని పాటించింది. రాష్ట్రంలో మూడు రిజర్వేషన్ నియోజకవర్గాలు ఉంటే రెండు చోట్ల మాదిగలకు, ఒకటి మాల సామాజికవర్గానికి ఇచ్చింది. కాంగ్రెస్ డబ్బులకు లొంగి ఇదే సామాజికవర్గానికి ద్రోహం, అన్యాయం చేసింది.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశంలోని సకల జనుల సంక్షేమానికి దోహదం చేస్తున్నది. 400 మంది ఎంపీలు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ చెప్తున్నది. అలా చేయడం వల్ల ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు తీవ్రంగా నష్టపోతాయి. వాళ్ల ఆస్తిత్వాన్ని కోల్పోతారు. కాబట్టి ఈ వర్గాలకు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఓటు వేసే ప్రయత్నం చేయవద్దు. అదే విధంగా ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా విర్రవీగి మాట్లాడుతున్న కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టాలి. ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలి.
సింగరేణిని ప్రైవేట్ పరం చేయవద్దని రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు స్వయంగా ప్రధానమంత్రిని కోరితే నాలుగు రోజులు తిరగకముందే నోటిఫికేషన్ ఇచ్చి ప్రైవేట్కు అప్పగించారు. బీజేపీ విధానమే పేద ప్రజలకు వ్యతిరేకమైన విధానం. కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం వంటి వాటిని ఇవ్వని పార్టీ. ఐటీఆర్ను బెంగుళూర్కు తరలించుకుపోయిన, కోచ్ఫ్యాక్టరీని గుజరాత్కు తరలించిన పార్టీ. తల్లిని చంపి బిడ్డను బతికించిందని తెలంగాణ ఏర్పాటుపై అక్కసు కక్కిన వ్యక్తి ప్రధాని మోదీ. ఇటువంటి వాళ్లు తెలంగాణను ఏమి చేయరు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ వారిది, కన్నతల్లి ప్రేమ బీఆర్ఎస్ది.
ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో కావాలనే కేంద్రం మభ్యపెడుతుంది. ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. బీసీ కులగణన విషయంలో కూడా బీఆర్ఎస్ చిత్తశుద్ధితో పని చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. బీజేపీ ప్రభుత్వం ఉన్నంత కాలం ఈ వర్గాలు నష్ట పోవాల్సిందే.