పెద్దపల్లి, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో పాల్గొన్న విద్యుత్తు ఉద్యోగి తులసిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధి గోదావరిఖనిలోని బృందావన్ గార్డెన్లో ఐఎన్టీయూసీ మహాసభ, పెద్దపల్లి పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ, రామగుండం ఎమ్మెల్యే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఇతర ఐఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు.
కాగా.. కరీంనగర్ ఎన్పీడీసీఎల్ ఎంఆర్టీ డివిజన్లో టీఆర్ఈ సెక్షన్లో వైడర్ గ్రేడ్(టెస్టర్)-2గా ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న తులసి ఈ వేదికను పంచుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేశారు. ఈ విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’లో ‘కాంగ్రెస్ వేదికపై విద్యుత్తు ఉద్యోగి’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని సుమోటోగా స్వీకరించిన విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులు ఉద్యోగి తులసిపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు కరీంనగర్ ఎంఆర్టీ డీఈ కాళీదాస్ తులసిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నియామవళిని ఉల్లంఘించిన కారణంగానే ప్రాథమిక చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తున్నట్టుగా పేర్కొన్నారు.