Telangana | హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ‘అమ్మకు ఆత్మీయత.. బిడ్డకు ప్రేమ’తో అనే నినాదంతో తెలంగాణ సర్కారు మహిళా, శిశు సంరక్షణకు పెద్దపీట వేసింది. అద్భుత పథకాలు.. అద్వితీయ కార్యాచరణతో రాష్ట్రంలోని ప్రతి తల్లీబిడ్డ క్షేమంగా ఉండేలా కడుపులో పెట్టుకొని చూసుకొంటున్నది. గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని అధిగమించడంతోపాటు మాతా, శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించగలిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ పథకాలు దేశంలోనే విప్లవాత్మక స్కీంలుగా ప్రశంసలు అందుకొన్నాయి. తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలిపాయి. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ చేపట్టిన కార్యక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
పిల్లల రక్షణ, భద్రతకు ప్రశంసలు
గిరిజనుల కోసం గిరిపోషణ
పౌష్టికాహారలోపం అధికంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికల పోషణ స్థితిని మెరుగుపరచడానికి ప్రత్యేకంగా గిరిపోషణ కార్యక్రమాన్ని తెలంగాణ సర్కారు చేపట్టింది. చిరుధాన్యాలతో కూడిన అల్పాహారం, స్నాక్స్ పోషణలో క్రీయాశీల భూమిక పోషిస్తున్నాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల గిరిజన ఆవాసాల్లో 3,000 మంది గర్భిణులకు ఇప్పపువ్వు లడ్డూను పంపిణీ చేస్తున్నారు.
తల్లీబిడ్డకు ‘ఆరోగ్య’లక్ష్మి
రాష్ట్రంలోని గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కారు తొలినాళ్లలోనే ఆరోగ్యలక్ష్మి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2015 జనవరి 1న ఆరోగ్యలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించింది. గర్భిణులు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారంతోపాటు ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం మాత్రలు పంపిణీ చేస్తారు. ఆరోగ్య తనిఖీలు, గర్భిణుల బరువు పర్యవేక్షణ, ఇంటింటికీ అంగన్వాడీ కౌన్సెలింగ్ ఉంటుంది. ఈ పథకం ద్వారా ఆహారపదార్థాల సరఫరా కోసం ఏర్పాటు చేసిన సప్లయ్ చెయిన్ మేనేజ్మెంట్ ఆహార పదార్థాల ఉత్పత్తి, పోషకాల కూర్పు, నాణ్యత నియంత్రణ, పర్యవేక్షణ, ప్యాకేజింగ్ తదితర అంశాల్లో దేశంలో అత్యుత్తమ పద్ధతులు పాటిస్తున్నదని నీతి అయోగ్ ప్రశంసించింది. కాగా, సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే ఆకు కూరలు, తాజా కూరగాయలను అందించేందుకు రాష్ట్రంలోని 13,531 అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రి గార్డెన్లు ఏర్పాటు చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏండ్ల వయసు ఉన్న చిన్నారులకు ప్రీసూల్ విద్యను అందిస్తున్నారు. తెలంగాణ వచ్చాక ఇప్పటివరకూ అంగన్వాడీ టీచర్లు.. సహాయకులకు దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణ సర్కారు 354 శాతం వేతనాలను పెంచింది.
మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం
షీ ట్యాక్సీ పథకం కింద మహిళా ప్రయాణికుల భద్రత, మహిళల ఉపాధి కోసం మహిళా డ్రైవర్లకు టాక్సీలు సబ్సిడీని ప్రభుత్వం అందించింది. మహిళలకోసం దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ మోటారు డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని తెలంగాణ సర్కారు హైదరాబాద్లో ఏర్పాటు చేసింది.
దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అనాథలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన, నిరాశ్రయులు, లైంగిక హింస, బాల్య వివాహ బాధితులైన బాలికలకు స్త్రీ, శిశు సంక్షేమశాఖ పాలిటెక్నిక్ విద్యను అందిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి దాకా 1,485 మంది మహిళలకు వివిధ రకాల వృత్తులపై తెలంగాణ గ్రేట్ ఉమెన్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణను ప్రభుత్వం అందించింది.
సాధించిన ఫలితాలు
అంగన్వాడీల వేతన పెంపువివరాలు
సంవత్సరం అంగన్వాడీ టీచర్స్ మినీ అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ హెల్పర్స్
2015 (మార్చి 11) రూ. 4,200 నుంచి రూ.7,000 రూ. 2,200 నుంచి రూ. 4,500 రూ. 2,200 నుంచి రూ. 4,500
2017 (ఫిబ్రవరి 27) రూ. 7,000 నుంచి రూ. 10,500 రూ. 4,500 నుంచి రూ.6,000 రూ. 4,500 నుంచి రూ. 6,000
2021 (ఆగస్టు 18) రూ. 10,500 నుంచి 13,650 రూ. 6,000 నుంచి రూ. 7,800 రూ. 6,000 నుంచి రూ. 7,800