కామన్గా ఉన్న సిలబస్ను మొదట ఎంపిక చేసుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. నోటిఫికేషన్ వెలువడిన దాన్నిబట్టి ఆయా పోస్టులకు ఉన్న ప్రత్యేక సిలబస్పై దృష్టిపెట్టాలి. ఇప్పటికే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మరింత సీరియస్గా ముందుకెళ్లాలి. చూద్దాంలే అంటూ ఇన్నేండ్లు దూరంగా ఉన్న అభ్యర్థులు ఏమాత్రం అలస్యం చేయకుండా ఈ రోజు నుంచే చదవటం మొదలు పెట్టాలి.
కరీంనగర్ మార్చి 11, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయి ఉద్యోగ నియామకాలకు ప్రకటన చేయటంతో ఉద్యోగార్థులకు తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ పలు సూచనలు చేశారు. ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి? సిలబస్ను ఎలా చూసుకోవాలి? ఆయా పోటీ పరీక్షలకు ఎన్ని మార్కులు ఉంటాయి? తదితర సందేహాలను నివృత్తి చేశారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయలేదని, అదీకాక.. మన ఉద్యోగాలు మన రాష్ట్ర బిడ్డలకే దక్కేలా తెచ్చిన నూతన జోనల్ విధానం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఉద్యోగార్థులకు అనేక అంశాలను వివరించారు.
ప్రస్తుతం ఉన్న సిలబస్ ప్రకారం గ్రూప్-1 పరీక్ష ప్రిలిమనరీ 150 మార్కులకు ఉంటుంది. మెయిన్స్లో ఆరు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్కు 150 మార్కుల చొప్పున 900 మార్కులు ఉంటాయి. 100 మార్కుల ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రూప్-2 ఆబ్జెక్టివ్ పరీక్ష విధానంలో నాలుగు (ఒక్కో పేపర్ 150 మార్కులు) పేపర్లు 600 మార్కులుంటాయి. ఇంటర్వ్యూ 75 మార్కులకు ఉంటుంది. గ్రూప్-3 ఆబెక్టివ్ ప్రశ్నలు 3 పేపర్లు (ఒక్కో పేపర్ 150 మార్కులు) మొత్తం 450 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ ఉండదు. గ్రూపు-4 రెండు పేపర్లు జనరల్ నాలెడ్జి 150, సెక్రటేరియల్ ఎబిలిటీ 150 మార్కులు ఉంటాయి. కాబట్టి నిరుద్యోగ యువత ఆయా గ్రూపులకు ప్రిపేర్ అయ్యే ముందు ఈ విషయాలను తెలుసుకొని, ముందుకెళ్లాలి.
దేశంలో ఎక్కడాలేని విధంగా 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా సీఎం కేసీఆర్ నూతన జోనల్ విధానాన్ని తీసుకొచ్చారు. గతంలో రాష్ట్రస్థాయి పోస్టులుగా ఉన్న ఆర్డీవో, ఆర్టీఏ, డీఎస్పీ, సీటీవో, ఎక్సైజ్ సూపరిటెండెంట్ తదితర పోస్టులను సైతం మలీ ్టజోనల్ విధానంలోకి తీసుకురావడం వల్ల 95 శాతం నుంచి దాదాపు 100 శాతం ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకే దక్కుతాయి. అంతేకాకుండా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో రోస్టర్ విధానాన్ని పాటిస్తూ నియామకాలు జరుగుతాయి. కాబట్టి అన్నివర్గాల నిరుద్యోగులకు, అన్ని ప్రాంతాల నిరుద్యోగ యువతకు సమాన అవకాశాలు లభిస్తాయి. ఈ తరహా విధానం దేశంలో ఎక్కడా లేదు. మన ఉద్యోగాలు మన వాళ్లకే దక్కాలన్న లక్ష్యంతోపాటు అన్ని ప్రాంతాలకు సముచిత స్థాయిలో ఉద్యోగాలు లభించేలా తీసుకొచ్చిన ఈ జోనల్ వ్యవస్థ ముఖ్యమంత్రి దూరదృష్టికి, స్వరాష్ట్ర యువతపై ప్రేమకు నిదర్శనంగా చెప్పవచ్చు.
నిజానికి ఎంచుకొన్న పోస్టులకు సంబంధించి ప్రామాణిక పుస్తకాలు, మెటీరియల్ అందుబాటులో ఉంటే కోచింగ్ లేకున్నా, ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించవచ్చు. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కోచింగ్ కేంద్రాలకు వెళ్లాలని భావించే వారు ఆ సెంటర్ పరిధిలో అందుబాటులో ఉన్న పుస్తకాలు, కావాల్సిన మెటీరియల్, అక్కడ ఉన్న వాతావరణం, వారికి ఉన్న అనుభవం, పూర్వ ప్రిపరేషన్, బోధించే వాళ్ల అనుభవాలు, గతంలో సాధించిన విజయాలు వంటివి ఒకటికి రెండు సార్లు తెలుసుకోవాలి. ఎవరో చెప్తే నమ్మి కోచింగ్ కేంద్రాల్లో చేరవద్దనేది నా సూచన.
కామన్గా ఉన్న సిలబస్ను మొదట ఎంపిక చేసుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. నోటిఫికేషన్ వెలువడిన దాన్నిబట్టి ఆయా పోస్టులకు ఉన్న ప్రత్యేక సిలబస్పై దృష్టిపెట్టాలి. ఇప్పటికే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మరింత సీరియస్గా ముందుకెళ్లాలి. చూద్దాంలే అంటూ ఇన్నేండ్లు దూరంగా ఉన్న అభ్యర్థులు ఏమాత్రం అలస్యం చేయకుండా ఈ రోజు నుంచే చదవటం మొదలు పెట్టాలి. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వ్యవధి తక్కువగా ఉంటే ప్రిపరేషన్కు కష్టమవుతుంది. సిలబస్లోని అన్ని పేపర్లకు అన్ని అంశాలకు, సమాన దృష్టి కేంద్రీకరించడంతోపాటు పాత ప్రశ్నపత్రాల విశ్లేషణను బట్టి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అంశాలను గుర్తించి, వాటిపై ప్రధాన దృష్టి కేంద్రీకరించాలి. తెలంగాణ ఉద్యమ చరిత్ర, భారత రాజ్యాంగం, కరెంట్ అఫైర్స్, సామాజిక అంశాల వంటి అంశాలపై ఫోకస్ చేయాలి. గ్రూప్-2లో వీటితోపాటు ఆర్థికం, మరియు అభివృద్ధిలో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేలా ప్రిపరేషన్ ఉండాలి. గ్రూప్-1కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మెయిన్స్, ప్రిలిమ్స్ కలిపి చదివితే మంచిది. ప్రిలిమ్స్ అయిన వెంటనే మెయిన్స్ క్వాలిఫై అవుతామనే నమ్మకం ఉన్నవారు వెంటనే మెయిన్స్కు ప్రిపరేషన్ను మొదలు పెట్టాలి. తెలుగు మీడియం అభ్యర్థులు తప్పనిసరి తెలుగు అకాడమీ పుస్తకాలతోపాటు ఆయా అంశాలపై నిష్ణాతులైన రచయితలు రచించిన పుస్తకాలు, మంచి పబ్లిషర్స్ పుస్తకాలను తీసుకోవాలి. గ్రూప్-1 మెయిన్స్ తప్ప అన్ని పోటీ పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటీకీ ఆయా అంశాలను వ్యాసరూప పద్ధతిలో ప్రిపేరవుతూ ఆబ్జెక్టివ్ ప్రశ్న, సమాధానాలను ఎప్పటికప్పడు ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దు. దానితో సమయం వృథా అవుతుంది. చదువుపై మాత్రమే దృష్టి సారించాలి. ప్రణాళికాబద్ధంగా కష్టపడాలి. అప్పుడే విజయం సాధ్యం అవుతుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే పరీక్షలకు సంబంధించిన సిలబస్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్లి నిశితంగా చూసుకోవాలి. ఇతర నియామకాలకు సంబంధించి నిర్వహించే పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్తో పాటే సిలబస్ వెలువరించే అవకాశముంటుంది.
త్వరలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇందుకోసం కసరత్తు చేస్తున్నాం. గ్రూప్-1, గ్రూప్-2లో విజేతలుగా నిలిచిన వారితో మాట్లాడుతున్నాం. చాలామంది సీనియర్లు తమ వంతు సహకారం అందించడానికి ముందుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాకేంద్రాల్లోని ఆడిటోరియాలు, విశ్వవిద్యాలయాలు, జిల్లా గ్రంథాలయ సంస్థల్లో పోటీ పరీక్షలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. ప్రతి జిల్లాలో నిర్వహించే సదస్సులు, అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే ప్రకటిస్తాం.
ఉద్యోగం కోసం 12 సూత్రాలను పాటించాలి.