హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చడానికి కాంగ్రెస్ పార్టీ మళ్లగుళ్లాలు పడుతున్నవేళ.. పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy ) దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. సీఎంతోపాటు మంత్రివర్గాన్ని నేడు ప్రకటిస్తామని పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ప్రకటించింది. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎంపికచేయడాన్ని ఉత్తమ్ సహా పార్టీలోని ఇతర సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేవంత్, భట్టివిక్రమార్కతోపాటు ఆయన కూడా సీఎం పదవి రేసులో విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి విషయంమై పార్టీ అగ్రనాయకులతో చర్చించడానికి అధిష్ఠాన దూతలుగా వచ్చిన డీకే శివకుమార్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే సోమవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. ఇంతలోనే ఉత్తమ్ కూడా దేశ రాజధానికి వెళ్లడంతో ఏదో జరుగుతుందనే అనుమానాలు వస్తున్నాయి కదా..
అయితే ఆయన హస్తినకు వెళ్లింది అందుకు కాదు. తన ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో ఆయన నేడు ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలువనున్నారు. ఈ సందర్భంగా తన రాజీనామా పత్రాన్ని స్పీకర్కు అందజేస్తారు. నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నల్లగొండ జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.