త్రిపురారం, ఫిబ్రవరి 15: ‘గడచిన కాలమే బహుబాగు..’ అని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏ రందీ లేకుండా పంటలు సాగుచేసుకున్న రైతులు ఇప్పుడు కష్టాలతో సావాసం చేస్తున్నారు. రెండు మూడు నెలల వరకు 18 గంటలు కరెంటు వస్తే సంతోషంగా పంటలు పండించుకున్న రైతులు ఇప్పుడు కరెంటు ఎప్పుడొస్తుందా? వస్తే ఎప్పటి వరకు ఉంటుందా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. రోజుకు 11, 12 గంటలు అది కూడా దఫదఫాలుగా ఇస్తుండడంతో తడిచిన మడే మళ్లీమళ్లీ తడుస్తూ చివరి వరకు నీరందక రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే కడుపు మండిన రైతన్న సహనం నశించింది.
కరెంటు ఏ సమయంలో ఇచ్చినా సరే నిరంతరాయంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం రాత్రి 9 గంటల సమయంలో నల్లగొండ జిల్లా త్రిపురారం రైతులు ఆందోళనకు దిగారు. మండలకేంద్రంలోని సబ్స్టేషన్ వద్దకు చేరుకుని కోదాడ-జడ్చర్ల హైవేపై ధర్నా చేశారు. ఐదారు గంటలకోసారి కరెంటు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని, పారిన పొలమే పారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండుమూడు నెలల క్రితం వరకు తామెన్నడూ కరెంటు కోసం ఎదురుచూడలేదని, ఇప్పుడుమాత్రం కండ్లలో వత్తులు వేసుకొని చూడాల్సి వస్తున్నదని వాపోయారు.
నిరుడు 27 ఎకరాల్లో సాగుచేస్తే ఈసారి సాగర్లో నీరు లేకపోవడంతో 17 వేల ఎకరాల్లోనే పంటలు సాగుచేస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు కరెంటు సక్రమంగా ఇవ్వకుంటే ఈ పంటల్లోనూ సగమే చేతికి అంతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలిసిన విద్యుత్తు ఏఈ రవీందర్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. విద్యుత్తు సరఫరాను మరో రెండు గంటలు పెంచుతామని, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
మొత్తం 11 ఎకరాల పొలంలో నాటేశాను. అందులో నా సొంత భూమి 6 ఎకరాలు. మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ప్రస్తుతం రోజుకు 12 గంటల కరెంటు కూడా రావట్లేదు. వచ్చే కరెంటు కూడా రెండు, మూడు దఫాలుగా వస్తుండడంతో పొలం సరిగా పారడం లేదు. వచ్చిపోయే కరెంటుతో పొలం దగ్గరే ఉండాల్సి వస్తున్నది. ఎంతో మంది రైతులు సొంత పొలం కాకుండా కౌలుకు తీసుకొని చేస్తుండడంతో అధికంగా నష్టపోతామనే భయం ఉంది. మాకైతే బోర్లు ఉండడంతో కొంత ఇబ్బంది తక్కువగా ఉన్నా.. లిఫ్ట్ కింద నాటేసిన పొలాలు మాత్రం ఎండిపోయినట్లే. రోజుకు కనీసం 18 గంటల కరెంటైనా ఇస్తే ఆరుతడి పంటల్లాగానైనా పండించుకుంటారు.
-అనుముల సుధాకర్రెడ్డి, రైతు, త్రిపురారం