హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): నల్లగొండలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి లైన్క్లియర్ అయింది. కేంద్ర సర్కారు నుంచి ప్రాథమిక అనుమతులు లభించాయి. ఈ నెల 11న కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్అండ్బీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నల్లగొండ మీదుగా వెళ్తున్న మూడు రహదారుల వాహనాలను పట్టణం బయటి నుంచే మలిపేవిధంగా బైపాస్ రోడ్డు ఏర్పాటుచేయాలని ఆర్అండ్బీశాఖ ప్రతిపాదించింది. 15 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణానికి రూ.700 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. ఇందులో భూసేకరణకే రూ.130 కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు.
నల్లగొండలోకి ప్రవేశిస్తున్న వాహనాల సంఖ్య, పట్టణంలో ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలు, బైపాస్ రోడ్డు నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలు, దీనికి అయ్యే ఖర్చు తదితర అంశాలపై అధికారులు సమగ్ర నివేదిక రూపొందించారు. ఇటీవల రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్రమంత్రి గడ్కరీకి ఆ నివేదికను సమర్పించారు. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. పూర్తి వివరాలు సమర్పించాలని ఆర్అండ్బీ అధికారులను కోరింది. ఈ నెల ఏడున రాష్ట్ర అధికారులు కేంద్ర రహదారుల మంత్రిత్వశాఖ అధికారులతో సమావేశమై వారు కోరిన వివరాలను సమర్పించనున్నారు.