నల్లగొండ, మార్చి 11 (నమస్తే తెలంగాణ): అసెం బ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని, లేదంటే ఉద్యమం తప్పదని భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సాహితీవేత్త జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన బీసీ హక్కుల సాధన కోసం స్థానిక చిన్న వెంకట్రెడ్డి ఫంక్షన్ హాలులో సోమవారం నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడుతూ.. బీసీ బిల్లుపై తీర్మానం చేసి సరిపెట్టడం కాద ని, ఇచ్చిన హామీకి అనుగుణంగా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్ కోసం ఏటా 20 వేల కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు. ఐదేండ్లకు లక్ష కోట్లు కేటాయించి బీసీ కులాల కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. కులగణన చేస్తే బీసీలకు 23,500 పదవులు వస్తాయన్న హామీని నెరవేర్చాలని కోరారు. కులగణన చేస్తే రిజర్వేషన్ విషయంలో స్పష్టత వస్తుందని చెప్పారు. బీసీలకు రాజ్యాధికారం రావాలన్నా, విద్య, ఉద్యోగావకాశాల్లో న్యాయం జరగాలన్నా, న్యాయస్థానాల్లో సముచిత స్థానం దక్కాలన్నా కులగణన ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు.
బహుజనుల కోసం పోరాటం చేసిన పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేస్తామన్న హామీపై ప్రభుత్వం ఎందుకు వెనక్కుతగ్గుతున్నదని ప్రశ్నించారు. అంతకుముందు బీసీ సంఘా ల నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని, లేదంటే ఉపేక్షించేది లేదని ముక్తకంఠంతో హెచ్చరించారు. సమావేశంలో సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, సత్యనారాయణ, రాంచందర్నాయక్, గట్టు రాంచందర్రావు పాల్గొన్నారు.