Nalgonda | హాలియా, ఏప్రిల్ 3: నల్లగొండ జిల్లా నందికొండ పట్టణంలో తాగునీటిని సరఫరా చేసే ట్యాంక్లో 30 కోతుల కళేబరాలు వెలుగుచూశాయి. మూడు రోజులుగా మున్సిపల్ అధికారులు ఈ నీటినే ప్రజలకు సరఫరా చేశారు. మున్సిపల్, ఎన్ఎస్పీ అధికారులు పొంతన లేని సమాధానం చెప్పడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నందికొండ మున్సిపాలిటీలోని మొదటి వార్డు విజయవిహార్ పక్కనే వాటర్ ట్యాంక్ ఉన్నది. ఈ ట్యాంక్ ద్వారా వార్డు ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
వాటర్ ట్యాంక్ పక్కనే నివాసం ఉండే వారు బుధవారం మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి మూడు రోజులుగా ట్యాంక్ వద్ద కోతులు పెద్దసంఖ్యలో గుమిగూడుతున్నాయని, ట్యాంక్లోకి దిగి అలజడి సృష్టిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. దాంతో మున్సిపల్ సిబ్బంది వాటర్ ట్యాంక్ వద్దకు వచ్చి చూడగా అందులో 30 కోతులు పడి మృత్యువాతపడ్డాయి.
సిబ్బంది ట్యాంక్లోకి దిగి కోతుల కళేబరాలను వెలికితీశారు. ఎండ తీవ్రత కారణంగా నీళ్లు తాగేందుకు వచ్చిన కోతులు ట్యాంక్లోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెంది ఉండవచ్చని మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ట్యాంక్లో మూడు రోజుల క్రితం కోతులు పడి మృతి చెందినా గమనించని అధికారులు, సిబ్బంది ఆ నీటిని కాలనీకి సరఫరా చేశారు.
ట్యాంక్ను పరిశీలించకపోవడం, శుభ్రం చేయకపోవడం వల్లే అందులో కో తులు పడిన విషయాన్ని గుర్తించలేకపోయారని ప్రజలు మండిపడ్డారు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఫైరయ్యారు. ఆ నీటిని తాగొద్దని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పట్టణ ప్రజలకు సూచించారు. కోతులుపడి మృతి చెందిన ట్యాంక్ను పూర్తిస్థాయిలో శుభ్రం చేయిస్తున్నామని ఎన్ఎస్పీ ఈఈ నాగేశ్వర్రావు తెలిపారు.